అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోదీ..! కశ్మీర్ పర్యవసానాల వివరణ..!!
Recommended Video
ఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ ఉదంతం పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. కశ్మీర్పై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి తెలియజేస్తున్నారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కశ్మీర్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు.
ఈ తరుణంలో కశ్మీర్ లోయకు బలగాల మోహరింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కశ్మీర్ లోయకు వాయుమార్గంలో పారామిలిటరీ బలగాలను తరలించారు. యూపీ, ఒడిశా, అసోం, ఇతర ప్రాంతాల నుంచి బలగాలను తీసుకెళ్తున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని అమిత్ షా ప్రకటించారు. అలాగే జమ్ము-కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు.
కశ్మీరు తన సొంత జాగీరైనట్టు వ్యవహరించే పాక్కు ఎన్నికల ముందు మోదీ సర్కారు గట్టిగా బుద్ధి చెప్పింది. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బాలాకోట్పై వైమానిక దాడి జరిపి మరీ హెచ్చరించింది. దీనికి తోడు అప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పాక్ను గ్రేలిస్టులో చేర్చడంతో ఆ దేశం ఆర్థికంగా కుదేలైంది. తప్పనిసరిగా పాక్ ఉగ్రవాదానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులను కల్పిస్తూ వచ్చింది. పుల్వామా దాడికి కారకుడైన మసూద్ అజార్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయించడంతో పాక్కు పెద్దషాక్. మరోపక్క భారత్ - అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటంతో పాక్కు దాదాపు 3 బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో పాక్ దాదాపు దివాలా అంచులకు చేరింది. దౌత్యపరంగా కూడా పాకిస్థాన్కు మద్దతుగా నిలిచే దేశాలను ఇప్పుడు వేళ్లపై లెక్కించి పరిస్థితి నెలకొనడం పాకిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.