రూపాయి పతనం, ఇంధన ధరలపై ఈ వారాంతంలో ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమెరికా డాలర్కు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకు పతనమవుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి ట్రేడింగ్లోనూ మరింత పతనమైన రూపాయి జీవనకాల కనిష్టస్థాయికి చేరుకుంది. అయితే, బుధవారం సాయంత్రం వరకు కొంత కోలుకుంది.
చారిత్రక కనిష్టస్థాయికి చేరిన రూపాయి మారకం: డాలర్కు రూ. 72.88
ఈ నేపథ్యంలో రూపాయి పతనం, పెట్రో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారంతంలో ప్రధాని నరేంద్ర మోడీ రూపాయి పతనం, ఇంధన పెరుగుదలపై సమీక్ష నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ సమీక్ష అనంతరం ప్రభుత్వం చేపట్టే చర్యలను వెల్లడించే అవకాశాలున్నాయి. కాగా, ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడంతోపాటు బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్కు గిరాకీ పెరుగుతుండటంతో రూపాయి విలువ పడిపోతోంది. బుధవారం 72.91కి చేరిన రూపాయి మారకం విలువ ఆ తర్వాత కొంత కోలుకుని 71.86గా కొనసాగుతోంది.