మోడీ నేతృత్వంలో ఆల్పార్టీ మీట్... కీలక బిల్లులపై తగ్గేదిలేదంటున్న ప్రతిపక్షాలు..
ఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన తొలి భేటీలో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాజ్యసభపక్ష నేత థావర్ చంద్ గెహ్లోట్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్ తరఫున డెరిక్ ఒబ్రెయిల్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, అప్నాదళ్ తరఫున అనుప్రియా పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ హాజరయ్యారు.
2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు ఎదగాలి: ప్రధాని మోడీ
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆల్పార్టీ మీటింగ్లో మోడీ ప్రతిపక్షాలను కోరారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేతలు కీలక బిల్లుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగం, వాక్ స్వాతంత్ర్యం, రైతాంగ సమస్యలపై సభలో చర్చించాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు తదితర బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించాలని తృణమూల్ కాంగ్రెస్ సూచించింది. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగ్గించుకోవాలని హితవు పలికింది.
ఆల్ పార్టీ మీట్ అనంతరం ఎన్డీఏ నేతలు ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. లోక్సభ, రాజ్యసభలో పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై నేతలు చర్చించనున్నారు.