రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలు
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమావారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు. వారణాసి-ప్రయాగ్ రాజ్ ఆరులేన్ల హైవేను జాతికి అంకింతం చేశారు. కాశీవిశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి..
Recommended Video
అనాథ టాపర్కు ఐఐటీ సీటు దక్కేనా? -చిన్న క్లిక్తో జీవితం తలకిందులు -రంగంలోకి సుప్రీంకోర్టు
రైతులకు భరోసా..
దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే చట్టాలను సవరించామని, రాబోయే రోజుల్లో ఆ ప్రయోజనాలను చూస్తారని అన్నదాతలకు ప్రధాని హామీ ఇచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు తమ పంటలను ఉత్తమ ధరకు విక్రయించుకునే స్వేచ్ఛ ఉందని, కొత్త చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలతోపాటు న్యాయపరమైన భద్రత కూడా లభిస్తుందని, రైతాంగం కోసమే ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు కావాలనే వదంతులు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ ఇష్టం.. బలవంతం లేదు..
‘‘దశాబ్దాలుగా అబద్ధపు హామీలు వినివినీ రైతులు ఇంకా ఆ భయంలోనే ఉన్నారు. నేను గంగ ఒడ్డున నిలబడి.. నదీమతల్లి సాక్షిగా చెబుతున్నాను.. రైతులకు మేలు చేయాలనే మా ఉద్దేశం.. ఈ గంగా నది అంతటి పవిత్రమైనది. రైతులను మభ్యపెట్టే ఉద్దేశం మాకు లేనేలేదు. అన్నదాతల శ్రేయస్సు కోసమే మేం పనిచేస్తున్నాం. కొత్త చట్టం వద్దు, పాత వ్యవస్థే బాగుందని అనిపిస్తే రైతులను ఎవరూ ఆపబోరు, కొత్త చట్టాలను కచ్చితంగా అనుసరించమని మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు..
నా విన్నపం ఒకటే..
రైతులకు వ్యతిరేకంగా కొందరు కావాలనే కొత్త చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతులను నేను కోరేది ఒక్కటే.. మా ప్రభుత్వం ట్రాక్ రికార్డు, పనితీరు చూడండి. అప్పుడు నిజమేంటో మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వాళ్లతో కేంద్రం మాట్లాడుతోంది. త్వరలోనే సమస్య పరిష్కారమవుతాయి. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం అన్ని రకాలుగా పనిచేస్తుంది'' అని ప్రధాని మోదీ చెప్పారు.
విశ్వనాథ ఆలయంలో పూజలు..
వారణాసి పర్యటన సందర్భంగా దొమారి ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకు బోటులో ప్రయాణించి, కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసి-ప్రయాగ్ రాజ్ మధ్య ఆరు లేన్లతో నూతనంగా నిర్మించిన హైవేను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలోనే ప్రధాని మాట్లాడుతూ రైతుల అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు పనితీరును ప్రధాని మెచ్చుకున్నారు. విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్టు పనులను సైతం ప్రధాని సమీక్షించారు.
జగన్ 'కోడికత్తి'లానే నాని 'తాపీ దాడి' -అప్పుడే చంపగలమన్న మాజీ పోలీస్ -ప్రాణాలిస్తానన్న మహిళ