అడవులకు వెళ్లా, హిమాలయాల్లో గడిపా : ఆత్మవిమర్శపై ''మోడీ'' ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై : ఆత్మవిమర్శతో సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యువత ఆలోచన దృక్పథం మారాలంటే అంతర్మథనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడానికి అడవికి ఒంటరిగా వెళ్లేవాడినంటూ గుర్తుచేసుకున్నారు. ఓ ఫేస్బుక్ పేజీ నిర్వాహకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఆత్మవిమర్శ అనేది మనిషిలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు మోడీ. ఇప్పటికీ తనకు ఎదురయ్యే ప్రతి సవాల్ ను ఎదుర్కొనే శక్తి లభిస్తోందంటే దానికి ఆత్మవిమర్శనే ప్రధాన కారణమని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దీపావళి పండుగ సమయంలో అడవిలోకి ఒంటరిగా వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చారు. అక్కడ తనకు ఏకాంతం లభించేదని తద్వరా అంతర్మథనం చేసుకునేవాడినంటూ వివరించారు.
యువతకు సందేశం
మోడీ ఇంటర్వూకి సంబంధించి హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ ఓ కథనం ప్రచురించింది. అందులో కొంతభాగం మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. యువకుడిగా ఉన్న రోజుల్లో ప్రతి దీపావళి పండుగకు 5 రోజులు ఎవరికి కనిపించకుండా పోయేవాడిని, ఆ విషయం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. అడవికి వెళ్లిపోయి మనుషులు లేని ప్రాంతంలో స్వచ్ఛమైన నీరుండే చోటకు చేరుకుని ప్రశాంతంగా ఆలోచించేవాడిని. ఇప్పటివరకు ఏం చేశాను, ఎలా ఉన్నాను, ఇకపై ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలపై దృష్టి సారించేవాడిని.. అలా అంతర్మథనం చేసుకుని ముందుకు సాగేవాడినంటూ పేర్కొన్నారు. అక్కడ టీవీ, రేడియోలు, వార్తాపత్రికలు ఏవీ ఉండేవి కాదని, ఇక ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఊసే లేదని.. అందుకే ఏకాంతం దొరికేదని చెప్పుకొచ్చారు.
యాంత్రిక జీవనంలో బిజీగా మారిన నేటి యువతరానికి సందేశమిచ్చారు మోడీ. బిజీగా ఉన్నప్పటికీ ఏదో సమయంలో తీరిక చేసుకుని అంతర్మథనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దాంతో ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుందని చెప్పారు. తద్వారా ఆత్మవిశ్వాసం కొండంతలా పెరుగుతుందని తెలిపారు. అలా క్రమంగా అలవాటు చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుందని వివరించారు. ఆపై తమ గురించి ఎవరేమనుకున్నా సరే కుంగిపోకుండా... నిండైన మనస్తత్వం అలవాటవుతుందని తెలిపారు.
కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ కలిస్తే యూపీలో బీజేపీకి 5 సీట్లే, లేదంటే 18 స్థానాలు
17 ఏళ్ల వయసులో హిమాలయాలకు..!
హిమాలయాలతో తనకున్న అనుబంధం ఈ సందర్భంగా వెల్లడించారు మోడీ. 17 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లినట్లు చెప్పారు. రెండు సంవత్సరాల పాటు అక్కడే గడిపానని వివరించారు. భగవంతుడికి తనకు తాను అంకితమైనట్లుగా చెప్పిన మోడీ.. జీవితంలో తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఏదో ఒకటి చేయాలన్న సంకల్పమే తనను ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు. అంతేగానీ ఏ మార్గాన్ని తాను ఎంచుకోలేదని వివరించారు.
ఆత్మవిమర్శ అన్నింటికీ సమాధానం
జీవితం ఎటు వెళుతుందో తెలియని యవ్వన దశలో ఆత్మవిమర్శ చేసుకోవడం అలవాటు అయ్యిందన్నారు మోడీ. ఆపై దేవుడు ఎలా తీసుకెళితే అలా వెళ్లిపోయానంటూ గతం గుర్తుచేసుకున్నారు. చిక్కుముడి వీడని ఎన్నోప్రశ్నలకు అంతర్మథనం తర్వాత సమాధానాలు దొరికాయని వెల్లడించారు. నాతో పాటు ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించిందన్నారు. హిమాలయాల్లో ఉన్నప్పుడు బ్రహ్మ ముహుర్తంలో గడ్డ కట్టే నీటితోనే స్నానం చేసేవాడినని, ఏకాంతం, ధ్యానం, శాంతి లాంటివి జలధార శబ్ధం నుంచి లభిస్తాయనే విషయం తెలుసుకున్నానని వివరించారు.