మోదీ 'పెద్ద దెయ్యం..! అమిత్షాను వీధిరౌడీతో పోల్చిన మమత..!!
Recommended Video
మధురాపూర్/హైదరాబాద్ : నియమావళి కంటే ఒకరోజు ముందే ప్రచారాన్ని కుదిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుతో పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం గురువారం ఒక్కసారిగా వేడెక్కింది. పశ్చిమబెంగాల్లో అల్లర్లపై ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షాను మమతా బెనర్జీ తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల ప్రచారాన్ని ఈసీ కుదించిందంటూ మండిపడ్డారు. మధురాపూర్లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ప్రధాని ఒక 'సైతాన్' అని, అమిత్షా 'గూండా' అని తూర్పారబట్టారు. బీజేపీ 'అబద్ధాల' పార్టీ అని, హింసను రెచ్చగొడుతోందని, ప్రజలను వేధించి పాలన సాగించడమే మోదీ, షా లక్ష్యమని నిప్పులు చెరిగారు. దేశ ఐక్యతను, బెంగాల్ ప్రతిష్టను బీజేపీ దెబ్బతీసిందని అన్నారు మమత.
బెంగాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు..! ఈసీ తీరును తప్పుబడుతున్న నేతలు..!!
'బెంగాల్ గౌరవాన్ని బీజేపీ దెబ్బతీసింది. అమిత్షా గూండాలు హింసను రేకెత్తించి, విగ్రహాలను ధ్వంసం చేశారు. హింసకు పాల్పడిన వాళ్లను ఎంతమాత్రం ఒదిలిపెట్టం. జైలుకు ఈడుస్తాం. బెంగాల్ ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రతీకారం తీర్చుకుంటాం. ఒక్క బెంగాలీ కూడా బీజేపీకి ఓటేయొద్దు. ఆ పార్టీ పాలనలో 12,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం అధికారం కోసం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను దోచుకుంటున్నారు. ఒక క్రిమినల్ సాయంతో ప్రధాని ర్యాలీ నిర్వహించారు' అంటూ మమత విమర్శల పరంపరం సాగించారు.
నన్ను ఎవరూ బెదరించ లేరు...! బెదిరిస్తే తట్టుకో లేరు... గరమైన దీదీ..!!
తనను ఎవరూ బెదరించలేరని, కనీసం అలా చేస్తే తట్టుకోనూ లేరని మమత సవాలు చేశారు. ఈ ఒక్కరోజులోనే తాను అన్ని ర్యాలీలను చుట్టేస్తానని చెప్పారు. టీఎంసీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధిపైన, రోడ్ల అనుసంధానంపైన, పేదలకు మెరుగైన వైద్యం అందిచడం పైనా దృష్టి సారించిందని, ప్రకృతిని వైపరీత్యాలను సైతం టీఎంసీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. దేహీ అంటూ బీజేపీకి సాగిలపడే ప్రసక్తే లేదని ఆమె కుండబద్ధలు కొట్టారు. అబద్ధాలతో ప్రచారం సాగించిన మోదీకి బెంగాల్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోంది..! సీపీఐ నేత నారాయణ ఘాటు విమర్శలు..!!
ఎన్నికల కమిషన్ తీరుపై వివిధ పార్టీ ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే టీడీపీ ఆందోళన చేస్తోంది. తాజాగా సీపీఐ నేత నారాయణ ఈసీ తీరుపై ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల విధానాల్లో మార్పులు రావాలన్నారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నారాయణ స్పష్టం చేశారు. చంద్ర శేఖర్ రావు, చంద్రబాబు బ్లాక్మెయిలింగ్ కోసమే సిట్లు వేస్తున్నారని ఆరోపించారు.
మోదీ కోసం పని చేస్తున్న ఈసీ..! మండిపడ్డ మాయావతి..!!
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం రాత్రి 10 గంటలతో తెరవేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ బెంగాల్లో ఇవాళ రెండు ర్యాలీల్లో ప్రసంగించాల్సి ఉన్నందునే రాత్రి 10 గంటల నుంచి ఈసీ నిషేధం విధించిందని మీడియాతో మాట్లాడుతూ మాయావతి అన్నారు. ప్రచారంపై నిషేధం విధించాలని అనుకున్నప్పుడు ఇవాళ ఉదయం నుంచే అది ఎందుకు అమలు చేసి ఉండకూడదని మాయావతి ప్రశ్నించారు. ఈసీ నిర్ణయం సమంజసం కాదని, ఒత్తిళ్లతోనే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీని ప్రధాని మోదీ, అమిత్షా, ఆ పార్టీ నేతలు టార్గెట్ చేసుకున్నారనేది స్పష్టమవుతోందని, ఇది చాలా ప్రమాదకరమైన, అన్యాయమైన నిర్ణయమని, దేశ ప్రధానికి ఇది తగదని మాయావతి అన్నారు.