ప్రధానికి గర్వభంగం తప్పదు!మోడీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక!
అంబాలా : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చివరి రెండు విడతల పోలింగ్కు ప్రచారం జోరుగా సాగుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ తన తండ్రిని అవమానించిన ప్రధాని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే రాజీవ్ గాంధి పేరుతో ఓట్లను అడగండి, మోడి సవాల్
ప్రధాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా పురాణాల ప్రస్తావన తెచ్చిన ఆమె.. అహంకారం విషయంలో మోడీ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణుడి ఎదుట దుర్యోధనుడికి జరిగినట్లే మోడీకి గర్వభంగం తప్పదని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలెవరూ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావించకపోవడాన్ని ప్రియాంక తప్పుబట్టారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో ఎన్నింటిని పూర్తి చేశారో బీజేపీ నాయకులెవరూ ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు. అమరుల పేర్లపై ఓట్లు అడగడం, దేశం కోసం ప్రాణాలర్పించిన తన కుటుంబ సభ్యలను అవమానించడం మినహా మోడీకి ఇంకేమీ తెలియదని ప్రియాంక విమర్శించారు.