మోడీనే తిరుగులేని నేత, కానీ బీజేపీకి 2014లా సీట్లు కష్టం: ప్రశాంత్ కిషోర్
పాట్నా: తాను జేడీయూలో చేరడానికి గల కారణాలను ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత పది పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాను ఇచ్చిన హామీలకు న్యాయం చేస్తూ వస్తున్నారని చెప్పారు. బెస్ట్ సీఎంలలో నితీష్ ఒకరు అన్నారు.
అలాగే, నరేంద్ర మోడీ ఇప్పటికి పెద్ద లీడర్ అని, అతనికి అనూహ్యమైన ఫాలోయింగ్ ఉందని అభిప్రాయపడ్డారు. అయితే 2014లో వచ్చినంతగా ఇప్పుడు ఉండదని అభిప్రాయపడ్డారు. 2014లో బీజేపీకి ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. మోడీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి, సందేహం లేదని, కానీ ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ సత్తా చాటలేదని చెప్పారు.
అతిపెద్ద పార్టీగా బీజేపీ
గత ఎన్నికల్లో కన్నా మెజార్టీ తక్కువ రానున్నప్పటికీ, బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపారు. బీహార్కు సేవ చేయాలనే ఇతర పార్టీల కోసం పని చేయడం మానివేసి, రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
అందుకే జేడీయూలో చేరా
జేడీయూ చిన్న పార్టీనని, ఆ పార్టీకి ఎలాంటి మచ్చ లేకపోవడం తనను ఆకర్షించిందన్నారు. తాను కాంగ్రెస్, బీజేపీలతో కలసి పని చేశానని, రాజకీయాల్లో రాణించడం కఠినమైన విషయమన్నారు. జేడీయూ నేతల సగటు వయస్సును 45 ఏళ్లకు తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వేసే అంచనాలన్నీ తారుమారవుతాయని, చివరి 10 నుంచి 12రోజులే అత్యంత కీలకమన్నారు.
బీజేపీయే లీడ్లో ఉంది, కానీ కష్టం
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారమని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టమేనని చెప్పారు. ఇప్పటికీ బీజేపీ లీడ్లోనే ఉందని, కానీ బీజేపీకి ఇతర పక్షాలు గట్టి పోటీ ఇవ్వలేమని చెప్పలేమని, అలాగే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని చెప్పలేమని అన్నారు. 2014 నాటి హైప్ తీసుకు రాలేమన్నారు.
బీజేపీకి 272 సీట్లు కష్టం
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారమని, అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి మేజిక్ ఫిగర్ రావడం కష్టమేనని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రతిపక్షం బలమైనదా కాదా అనే విషయం పక్కన పెడితే, ఇతర అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయన్నారు. పేదలు ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేమన్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఎన్నికలపై ఎంతో ఉందని చెప్పారు. 2014లో నాలుగు కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉంటే ఇప్పుడు 40 కోట్లు ఉన్నాయని చెప్పారు.