నరేంద్రమోడీ క్రీస్తు సేవకుడే, క్రైస్తవులంతా..: కేథలిక్ చర్చ్
కొచ్చి: దేశంలోని తొలి క్యాథలిక్ టీవీ చానల్ షాలోంకు చెందిన క్యాథలిక్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీని నిజమైన దైవ సేవకుడు అని చెబుతోంది. మోడీ ప్రధానిమంత్రి కావాలన్నది దేవుని నిర్ణయమని, దానికి క్రైస్తవులందరూ కట్టుబడి ఉంటారని ఆ పత్రిక తన తాజా ఎడిషన్ సంపాదకీయంలో పేర్కొంది.
భగవంతుడు తాను సృష్టించగలిగిన మంచితనాన్నంతా మోడీ సర్కారు ద్వారా వెల్లడి చేయదలచాడని ఆ పత్రిక తెలిపింది. మోడీ జీసస్ క్రీస్తు సేవకుడు అని షాలోం పేర్కొంది.
షాలోం వీక్లీ సండే న్యూస్ పేపర్ ఆంగ్లం, మలయాళం, తమిళ భాషల్లో వస్తుంది. ఈ పత్రిక యూఎస్ఏలోను పబ్లిష్ అవుతోంది. ఈ షాలోంను కేథలిక్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) హెడ్ కార్డినల్ సెలెమస్ ప్రచురిస్తున్నారు.
కాగా, ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనూహ్య గెలుపు సాధించిన విషయం తెలిసిందే. మోడీ హవా ముందు కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. బీజేపీ 283కు పైగా స్థానాలలో గెలవగా కాంగ్రెసు పార్టీ కేవలం 44 స్థానాలతో సరిపెట్టుకుంది.