మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రాహుల్ కూడా తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల కమీషన్ ను అడ్డంపెట్టుకుని రాజకీయం చేసిన తొలి ప్రధాని మోదీ అని ఘాటు ఆరోపణలు చేసారు రాహుల్ గాంధీ.
మోదీ మీడియా సమావేశం గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. రాఫేల్ అంశంపై చర్చకు రావాలని ఆయనకు నేను ఎన్నోసార్లు సవాల్ విసిరాను. కానీ దానికి ఆయన ఎన్నడూ స్పందించలేదు. నాతో చర్చకు మోదీ ఎందుకు సిద్ధంగా లేరని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయన ప్రెస్మీట్లో ఉన్నారుగా.. దీనికి సమాధానం చెప్పండి. ఇక మీడియా వాళ్లు కూడా నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతూ.. మోదీని మాత్రం దుస్తులు, మామిడి పండ్ల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే మోదీ, భాజపా వద్ద చాలా రెట్లు డబ్బు ఎక్కువగా ఉంది. కానీ మా దగ్గర నిజం మాత్రమే ఉంది. ఆ నిజమే గెలుస్తుంది, అని రాహుల్ అన్నారు. తాజా ఎన్నికల్లో ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మోదీ షెడ్యూల్ ప్రకారమే ఉత్తర్వులు ఇస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. మోదీ, షా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ మరోసారి ప్రయత్నిస్తున్నారని, అయితే అది జరగదని ఎద్దేవా చేశారు.