కాంగ్రెస్కు విభజించడమే తెలుసు! ఏపీ-తెలంగాణను శత్రువులుగా మార్చేశారు: మోడీ కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ప్రజలను విభజించడమే తెలుసంటూ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంతోషాన్ని పంచాలని చూస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సమాజాన్ని విడదీయాలని చూస్తోందని విమర్శించారు.
కార్యకర్తలతో మోడీ..
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోడీ ‘నమో' యాప్ ద్వారా రాయ్పూర్, మైసూర్, దమోహ్, కరోలి, ధోల్పూర్, ఆగ్రా ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తలతో బుధవారం మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఐక్యత కోసం బీజేపీ.. కాంగ్రెస్ విడదీస్తూ పోతోంది..
‘ఎన్నికల్లో గెలుపు సాధించడమనేది ముఖ్యమైన విషయం కాదు. దీని వల్ల మేము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందగలుగుతున్నాం. బీజేపీ ఐక్యత కోసం పోరాడుతుంటే.. కాంగ్రెస్ ఒక కుటుంబం లాభపడేందుకు ప్రజలను విడదీసేందుకు ప్రాధాన్యత ఇస్తుంది' అని మోడీ ధ్వజమెత్తారు.
ఏపీ, తెలంగాణలను శత్రువులగా మార్చారు
విభజన పేరుతో ఒకే భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ విడదీసి ఒకరినొకరిని శత్రువులుగా చేసిందని నరేంద్ర మోడీ విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంభించే అవకాశముందన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్న అంశం గురించి ఆయన ప్రస్తావించారు.
మహాకూటమి విఫలమైన ఆలోచన
‘మహాకూటమి ఓ విఫలైమన ఆలోచన. ఇందులోని పార్టీలు ఒకరితో ఒకరు పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఒకే దగ్గరకు చేరతారు. కర్ణాటకలో ప్రస్తుతం అదే మనం చూస్తూ ఉన్నాం. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ అదే చేయాలని ప్రయత్నిస్తున్నారు' అని ధ్వజమెత్తారు. గుజరాత్లో ఇతర రాష్ట్రాల వారిపై దాడులు జరుగుతున్నా.. ప్రధాని స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో మోడీ ఈ విధమైన కౌంటర్ ఇచ్చారు.