జమ్మూ కశ్మీర్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది..బెంగాల్లో ఎందుకలా: మోడీ
పశ్చిమ బెంగాల్ కంటే ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా కనిపించే జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోనే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం అమిత్ షా కోల్కతా రోడ్షోలో జరిగిన హింసాత్మక ఘటనను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు.
ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ ఏ పార్టీకి చెందని తటస్తులు ప్రశ్నించకపోవడం ఆవేదన కలిగించిందని ప్రధాని మోడీ అన్నారు. తనపై విషం చిమ్ముతున్నప్పటికీ అన్నీ తెలిసీ కూడా మౌనం వహించి క్షమిస్తున్నారంటే భవిష్యత్తులో దేశం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని మోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్క హింసాత్మక ఘటన కూడా జరిగినట్లు నివేదిక రాలేదని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. అదే సమయంలో బెంగాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరిగాయని ఆసమయంలో చాలామంది మృతి చెందారని చెప్పారు. గెలుపొందిన వారి ఇళ్లకు నిప్పు కూడా పెట్టారని తెలిపారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులు భయాందోళనల మధ్య జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి తలదాచుకున్నారని ప్రధాని చెప్పారు. గెలవడమే వారు చేసిన పాపం అని చెప్పారు.
ఇక కోల్కతా యూనివర్శిటీలోని ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్ విగ్రహం ధ్వంసం చేశారు. అయితే ఇది బీజేపీ వారి పనే అని టీఎంసీ ఆరోపిస్తుండగా.. అది చేసింది టీఎంసీ పార్టీకి చెందిన వారే అని బీజేపీ చెబుతోంది. అమిత్ షా రోడ్ షో సందర్భంగా టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అమిత్ షా కాన్వాయ్పైకి రాళ్లతో దాడి కూడా చేశారని స్వయంగా షానే చెప్పారు. ఇక చివరి దశ పోలింగ్లో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం ఉందని ఆ రోజున భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలుపుతూ ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేశారు కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, ముఖ్తార్ నక్వీ అబ్బాస్.