నమో నమ: తిరుగులేని శక్తిగా బీజేపీ, ఇందిరాలా డైనమిక్ లీడర్, రెండోసారి ప్రధాని
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. సొంతంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్లింది ఎన్డీఏ కూటమి. ఇంతరకు ఓకే .. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా విజయం సాధించింది. దేశ చరిత్రలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టబోతోంది. ఇంతకీ బీజేపీ గెలవడానికి కారణమేంటీ ? ప్రభుత్వ విధానాలా ? నమో మంత్రమా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.
వార్ వన్సైడ్
ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అని .. ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతోందని సర్వేలు ఢంకా బజాయించి చెప్పాయి. అయితే విపక్షాలు మాత్రం సర్వేలను తప్పుపట్టాయి. గతంలో కూడా తప్పాయని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు మాత్రం కమల వికసానికి తోడ్పడ్డారు. గతంలో ఇందిరాగాంధీ 1971లో తిరిగి పదవీ చేపట్టారు. ఆ తర్వాత మోదీ ఒక్కరే తిరిగి ప్రధాని పీఠం అధిష్టించబోతున్నారు.
హిందీ రాష్ట్రాల అండ
బీజేపీకి మరోసారి హిందీ రాష్ట్రాలు వెన్నుదన్నుగా నిలిచాయి. దీంతోపాటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితమైన బీజేపీ .. 4 ఎంపీ స్థానాల్లో లీడ్లో ఉండటం ఆ పార్టీ శ్రేణులకు కలిసివస్తోంది. ఇక కర్నాటకలో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. అధికార జేడీఎస్, కాంగ్రెస్ కూటమి డబుల్ డిజిట్ చేరుకోకపోవడం గమనార్హం. ఇక హిందీ రాష్ట్రాల విషయానికొస్తే బీహర్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీలో బీజేపీ హవా కొనసాగింది. మెజార్టీ సీట్లు ఉన్న యూపీలో గతం కన్నా సీట్లు తగ్గినా బీజేపీ లీడ్లో ఉంది. ఇక్కడ ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసినా కమలం జోరు ముందు నిలబడలేకపోయింది. వీటితోపాడు బెంగాల్, ఒడిశాలో బీజేపీ బలపడి స్థానిక పార్టీలకు ముచ్చెటమలు పట్టించాయి. కశ్మీర్లో కూడా పట్టును నిలబెట్టుకుంది. మోదీ ఇలాకా గుజరాత్లో ఓటు షేర్ ఏ మాత్రం తగ్గలేదు.
డైనమిక్ లీడర్
మోదీ బలమైన నేత అని ఫలితాలు రుజువు చేశాయి. ఇదివరకు ఇందిరా వరుసగా రెండోసారి ప్రధాని పదవీ చేపట్టారని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో పార్టీలో, ప్రభుత్వంలో ఇందిరా ఎలా బలమైన నేతే .. ఇప్పుడు మోదీ కూడా తిరుగులేని నాయకుడని అభివర్ణిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని కూటములు ఏర్పాటుచేసినా .. ఫలితం లేకపోయింది. మోదీ ధైర్యంగా, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడంతో డైనమిక్ లీడర్గా ఎదిగారు. పాలనపై పట్టు సాధించి .. విపక్షాలను ఎండగట్టి దేశాభివృద్ధిలో కీ రోల్ పోషించారని జరిగిన ఘటనలు గుర్తుచేస్తున్నాయి.