గ్లోబల్ లీడర్స్: అగ్రస్థానంలో నరేంద్ర మోడీ, రెండో స్థానంలో జింపింగ్
బీజింగ్: దేశీయ, అంతర్జాతీయ సంబంధాలపై చైనా సంస్థ చేపట్టిన గ్లోబల్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు జింపింగ్ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. చైనా నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే 2014ను తొమ్మిది దేశాల్లో నిర్వహించింది.
అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, ఇండియా, రష్యా, బ్రెజిల్, చైనా దేశాల్లో ఈ సర్వేను నిర్వహించగా.. దేశీయ, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో చైనా అధ్యక్షుడు జింపింగ్ నిలిచారు.
చైనా ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ గ్రూప్ ఈ సర్వేను బీజింగ్లో విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కేమెరూన్, నాలుగో స్థానంలో సింగ్ ఉన్నారు.
భారత్, చైనా, యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యాలోని 4,500మందికి ఈ సర్వే చేరుకుందని చైనా అధికారిక డెయిలీ పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ సంబంధాలను మెరుగ్గా కొనసాగిస్తున్న జింపింగ్ రెండో స్థానం దక్కించుకున్నారని తెలిపింది.
దేశీయ, అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపర్చడంలో సమర్థవంతంగా ముందుకెళుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సర్వేలో అగ్రస్థానం సంపాదించారని పేర్కొంది. కాగా, ఈ సర్వే ముఖ్య ఉద్దేశం చైనాకు అంతర్జాతీయ గుర్తింపు తేవడం.