ఇండిపెండెన్స్ డే గిఫ్ట్: పన్నును పూర్తిగా ఎత్తివేసే యోచనలో ప్రధాని మోడీ..?
Recommended Video
ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే వ్యవధి ఉంది. అప్పుడే రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలకు పదను పెట్టాయి. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోంటే... బీజేపీని అడ్డుకుని తీరాలని విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. పార్టీల తీరు ఎలా ఉన్నా అల్టిమేట్గా ప్రజలే ఎవరు అధికారంలోకి రావాలనేది నిర్ణయిస్తారు. అలాంటి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల పాట్లు ఫీట్లు ఓ రేంజ్లో ఉంటాయి. ఇక ఎన్నికలకు వెళ్లే ముందు ఇదే చివరి స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఎర్రకోటపై ప్రధాని మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తారా అని దేశం యావత్తు ఎదురు చూస్తోంది.
పెద్ద నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు మోడీ కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దనోట్ల రద్దుతో అవినీతికి చెక్ పెట్టామని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నా... వాస్తవానికి అది సామాన్యుడికి నరకం చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు జీఎస్టీపై ఇప్పటికీ సామాన్యుడిలో క్లారిటీ రాలేదు. ఇంత వ్యతిరేకత ఉందని మోడీ గ్రహించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎర్రకోటపై ఆగష్టు 15న జాతీయ జెండా ఎగురవేయగానే మోడీ కీలక ఉపన్యాసం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి, పేద ప్రజలకు వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం. ఈ సారి ప్రజాకర్షక వరాలు ప్రకటించకపోతే 2019 స్వాతంత్ర్య వేడుకల్లో మోడీ త్రివర్ణపతాకం ఎగురవేయడం అనుమానమనే చెప్పాలి.
మోడీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజల వేవ్ చాలా పాజిటివ్గా ఉండాలి. ఇదే మోడీని, బీజేపీని వేధిస్తోందట. అందుకే ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఎర్రకోట వేదికగా ఆగష్టు 15న మోడీ దేశ ప్రజలకు వరాలు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తను దేశ ప్రజలను మోడీ ఏమి చెప్పి ప్రసన్నం చేసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక విపక్షాలైతే కంటిమీద కునుకులేకుండా మోడీ ప్రసంగంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు నరేంద్ర మోడీ అనేక వ్యూహాలకు పదనుపెడుతున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీలాంటి అంశాలు బ్యాక్ ఫైర్ అవడంతో మోడీ ఈసారి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ రెండు అంశాలు ప్రజావ్యతిరేకతను తీసుకొచ్చాయి.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలు ప్రకటించి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రధాని మోడీ... ఈసారి అదే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త ఆకర్షక వరాలు ప్రకటించాలని డిసైడ్ అయినట్లు కమలనాథులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇన్కం ట్యాక్స్ రద్దు చేయాలని మోడీ భావిస్తున్నారని సమాచారం. ఇక ఆదాయపు పన్ను రద్దు ప్రకటన చేసి ప్రజలకు మిఠాయిలాంటి తీపికబురు ప్రధాని మోడీ చెప్పబోతున్నట్లు బీజేపీ నేతల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. ఎర్రకోటపై నుంచే ఈ ప్రకటన చేసే యోచనలో ప్రధాని ఉన్నట్లు బీజేపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రతి ఏటా బడ్జెట్ సమావేశాల్లో ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా అని ఉద్యోగస్తులు ఆశగా ఎదురు చూసేవారు. అయితే ప్రతీసారి వారికి నిరాశే మిగిలింది. ఇక ఎన్నికలకు వెళ్లేముందు చివరి స్వాతంత్ర దినోత్సవం కావడంతో మోడీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక పన్ను మినహాయింపులు, స్లాబ్ రేట్లతో పనిలేకుండా ఏకంగా ఒకటే సారి పన్ను ఎత్తివేస్తే కచ్చితంగా సానుకూల పవనాలు వీస్తాయని మోడీ అంచనా వేస్తున్నారట. మోడీ టీమ్ వ్యూహం కూడా ఇదే ఉందని తెలుస్తోంది. పన్ను ఎత్తివేయడంతో పాటు పేదమధ్యతరగతి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున వరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.