ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలు
వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్ మోహన్ మాలవ్యకు పూలమాల వేసి ... అక్కడే గల లంక గేటు నుంచి రోడ్ షో జరిగింది. వారణాసి పురవీధుల్లో ఆశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ మోదీ రోడ్ షో కొనసాగింది.
ముస్లింల బ్రహ్మారథం ..
ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మదన్ పురా, సోనార్ పురాతోపాటు 150 ప్రదేశాల గుండా రోడ్ షో కొనసాగింది. ముస్లింలు కూడా మోదీ రోడ్ షోకు జేజేలు పలికారు. మొత్తం మీద 7 కిలోమీటర్ల మేర పురాతన ఆలయాలు, ఘాట్ల గుండా రోడ్ షో రెండున్నర గంటలపాటు సాగింది. రోడ్ షో ముగిశాక మోదీ బృందం దశాశ్వమేధ ఘాట్ వద్దకు చేరుకుంది. గంగా హారతి కార్యక్రమంలో మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. ఇతర నేతలు పాల్గొన్నారు. గంగానదీకి మోదీ ప్రత్యేక పూజల నిర్వహించారు. ఘాట్ వద్ద పూజారులతోపాటు మోదీ కూడా మంత్రోచ్చరణలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనడం అమిత ఆనందాన్ని కలిగించిందన్నారు మోదీ.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
రోడ్ షో తర్వాత వారణాసి ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. జాతీయ భద్రత ముఖ్యమని పేర్కన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులతో యావత్ ప్రపంచం భారత్ వెనుక ఉందని గుర్తుచేశారు. గత ఐదేళ్ల నుంచి ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డామని .. మరో ఐదేళ్ల కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీనిచ్చారు.
కార్యకర్తలతో మమేకం, కాలభైరవుని దర్శనం
గురువారం వారణాసిలోనే బసచేసిన మోదీ .. శుక్రవారం ఉదయం బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. తర్వాత కాలభైరవుడి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడినుంచి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, పీయూష్ గోయల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బిహార్ సీఎం నితీష్కుమార్, శిరోమణి అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్ బాదల్, లోక్ జనశక్తి చీఫ్ రామ్విలాస్ పాశ్వాన్ తదితరులు పాల్గొంటారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.