పీ&ఎన్: మోడీ కొత్త ఫార్ములా.. రాజీనామాలకు కారణమిదే!, మంత్రివర్గంలోకి జేడీయూ..
పాజిటివ్, నెగటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా వారిని శాఖల నుంచి తప్పుకునేలా చేశారని అంటున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా శుక్రవారం ఐదుగురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల రాజీనామా విషయంలో ప్రధాని మోడీ 'పీ అండ్ ఎన్' ఫార్ములా పద్దతిని ఫాలో అయ్యారని చెబుతున్నారు. దీంతో అసలేంటీ 'పీ అండ్ ఎన్' ఫార్ములా అన్న చర్చ జరుగుతోంది.
పీ అండ్ ఎన్ ఫార్మలా:
ఇంతకీ 'పీ అండ్ ఎన్' ఏంటంటే.. పాజిటివ్ అండ్ నెగటివ్ అని అర్థం. కేంద్రమంత్రుల పనితీరును మోడీ ఈ పద్దతిలోనే బేరీజు వేశారట. ఇందుకోసం ఒక ఎక్సెల్ షీట్ తయారుచేసి.. ఆయా నేతల పేర్ల ముందు 'పీ అండ్ ఎన్' అక్షరాలను రాసుకుంటూ వెళ్లారట. ఈ ఎక్సెల్ షీట్ లో ఎవరికైతే పీ-పాజిటివ్ అని మోడీ రాశారో వాళ్లు మాత్రమే కేబినెట్ లో తిరిగి కొనసాగుతారు.
ఎన్-నెగటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నవారు కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురవుతారనేది మోడీ సంకేతం. ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ కారణంగానే కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమా భారతి, కల్ రాజ్ మిశ్రా, ఫగ్గన్ సింగ్, సంజీవ్ బలియన్, మహేంద్ర పాండేలు తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది.
జేడీయూ, అన్నాడీఎంకెకు ఛాన్స్:
నిర్మలా సీతారామన్, మహేంద్ర పాండే, గిరిరాజ్ సింగ్ లు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కొత్తగా ఎన్డీయేలో చేరిన జేడీయూ, అన్నాడీఎంకె నేతలకు కేబినెట్ లో చోటు కల్పించాలని మోడీ భావిస్తున్నట్లుగా సమాచారం.
జేడీయూ నుంచి ఒకరు లేదా ఇద్దరకి అలాగే అన్నాడీఎంకెలోను ఒకరు లేదా ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలని మోడీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో పాటు ప్రస్తుతం కేంద్రమంత్రులుగా కొనసాగుతున్నవారిలో ఐదుగురికి పదోన్నతి లభించనుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, సదానంద గౌడ్, మేనకాగాంధీల శాఖలు కూడా మారే అవకాశముందంటున్నారు.
సురేశ్ ప్రభు శాఖ మార్పు:
రైల్వే శాఖ నుంచి తప్పుకోవడానికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు సిద్దపడటంతో.. ఆ శాఖను నితిన్ గడ్కరీకి అప్పగించి ఆయనకు పర్యావరణ శాఖ అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా విస్తరణలో అదనపు శాఖలు ఉన్న మంత్రులకు ఉపశమనం కలుగుతుందంటున్నారు.
రాష్ట్రాల బాధ్యతలు:
అదనపు శాఖలు కలిగి ఉన్న మంత్రుల వద్ద నుంచి ఇతర మంత్రులకు వాటిని కేటాయించే అవకాశం ఉంది. మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజీవ్ ప్రతాప్ రూడీకి బీహార్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మహేంద్ర పాండేను ఇప్పటికే యూపీ బీజేపీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే. కల్ రాజ్ మిశ్రా వయసు 75ఏళ్లు దాటడంతో ఆయనకు గవర్నర్ పదవి కట్టబెడుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.