ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులు
Recommended Video
ఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దేశ విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మోడీతో ప్రమాణం స్వీకారం చేయిస్తారు. అయితే రాష్ట్రపతి, మోడీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చాలా సింపుల్గా నిర్వహిస్తున్నారు అధికారులు.
మహాత్ముడికి మోడీ నివాళులు
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. మహాత్మడి సమాధి దగ్గర కొంత సమయం గడిపారు నరేంద్ర మోడీ. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే క్రమంలో బాపు అహింస అనే ఆయుధాన్ని వినియోగించారని మోడీ గుర్తుచేసుకున్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి సమాధికి నివాళులు
అనంతరం మోడీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో కలిసి బీజేపీ నేత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా వాజ్పేయి తీసుకువచ్చిన సంస్కరణలను గుర్తు చేసుకున్నారు మోడీ
అమరవీరుల స్తూపం వద్ద అమరులైన జవాన్లకు సెల్యూట్
వాజ్పేయి సమాధికి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లకు నివాళులు అర్పించారు. వారు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధినేతలు మోడీతో పాటు ఉన్నారు.
ఢిల్లీకి చేరుకుంటున్న విదేశీ అతిథులు
మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఢిల్లీకి అతిథులు చేరుకుంటున్నారు. వారందరినీ ప్రభుత్వ ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికి వారికి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు ఇప్పటికే భూటాన్ ప్రధాని డాక్టర్ లొటే షెరింగ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్లు ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఘనస్వాగతం పలికారు.