నూతన పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపన.. శిలాఫలకం ఆవిష్కరణ...
దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(డిసెంబర్ 10) మధ్యాహ్నం 12.55గంటలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు వేద పండితుల మంత్రోచ్ఛరణలు,మంగళవాయిద్యాల నడుమ పవిత్ర యజ్ఞ కార్యంతో భూమి పూజ నిర్వహించారు. భూమిపూజ అనంతరం మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దాదాపు 200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Recommended Video
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇది 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ శుభదినం అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.
ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్లో రూ.20వేల కోట్ల వ్యయంతో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్పథ్ పునరుద్దరణ చేపట్టనున్నారు. అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు.
సుమారు రూ.1వెయ్యి కోట్ల వ్యయంతో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం జరగనుంది. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. 2022 వరకు దీని నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే ఇది చాలా పెద్దది. ఇందులో లోక్సభ సుమారు 888 సీట్లు, రాజ్యసభ 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉభయ సభల్లో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. భవిష్యత్తులో దేశంలో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నందునా... ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉండేలా పార్లమెంటు నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత లోక్సభలో 545 సీట్లు,రాజ్యసభలో 245 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే.
पीएम श्री @narendramodi नई दिल्ली में संसद के नए भवन का शिलान्यास करते हुए। #NewParliament4NewIndia pic.twitter.com/GKIQAUaeee
— BJP (@BJP4India) December 10, 2020
అయితే శంకుస్థాపన మినహా ఇప్పుడే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.దీంతో ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి నిర్మాణ పనులకు ఆస్కారం లేదు.