నరేంద్ర మోడీ వల్లే ఉన్నాను, అందులో సమర్థుడు: దేవేగౌడ చురకలు
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా ఆయన ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. దేవేగౌడ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఎదురువెళ్లి స్వాగతం పలుకుతానని చెప్పారు.
దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే బీజేపీ - జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటికే దేవేగౌడ స్పష్టత ఇచ్చారు. బీజేపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
గాలి-జగన్ ఈడీ కేసుల్లో సడలింపు, మీ తప్పులు నా నెత్తిన వేసుకోను: బీజేపీపై బాబు ఆగ్రహం
అంతమాత్రాన పొత్తు ఉండదు
కన్నడ ప్రజల గౌరవాన్ని సిద్ధరామయ్య ఎలా దిగజార్చారో చెబుతూ, ఒక కన్నడ వ్యక్తి ప్రధాని అయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారని, అంతమాత్రాన పొత్తు ఉంటుందని అర్థం కాదని దేవేగౌడ తేల్చి చెప్పారు. పొత్తు ఉండే ప్రసక్తి లేదన్నారు.
దానికి సిద్ధరామయ్య ఏం చెబుతారు?
ఇటీవల సిద్ధరామయ్య తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా దేవెగౌడ స్పందించారు. తాను కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నానని సిద్ధరామయ్య ఆరోపణలు చేస్తున్నారని, సిద్ధరామయ్య తనయుడు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. దానికి సిద్ధరామయ్య ఏ సమాధానం చెబుతారన్నారు.
మోడీకి చురకలు
తనపై ప్రశంసలు కురిపించిన మోడీకి కూడా దేవేగౌడ చురకలు అంటించారు. తనపై ప్రశంసలు కురిపించి సానుభూతి పొందాలని చూస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. నచ్చచెప్పి ఒప్పించడంలో మోడీ తర్వాతే ఎవరైనా అని అన్నారు. మోడీ నచ్చచెప్పడం వల్లే నేను ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు.
మోడీ చెప్పడం వల్లే ఆగిపోయా
బీజేపీ సొంతగా మెజార్టీ సాధిస్తే తాను రాజీనామా చేస్తానని 2014 లోకసభ ఎన్నికలకు ముందు చెప్పానని దేవేగౌడ అన్నారు. ఆ తర్వాత బీజేపీకి మెజార్టీ వచ్చిందని, తాను రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని, కానీ తనలాంటి సీనియర్ నేత సేవలు ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆపారని అన్నారు.
నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్
కాగా, అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. దేవేగౌడ వంటి సీనియర్ నాయకుడి పట్ల కాంగ్రెస్ పార్టీ అగౌరవం ప్రదర్శిస్తోందని, అది సరికాదని, అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్నాటక ప్రజలకు ఎలా మంచి చేస్తుందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారికి క్లీన్ చిట్ ఇస్తూ బీజేపీ ఇంకా అవినీతి గురించి కబుర్లు చెబుతోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీనియర్లను ఎలా అవమానించాలో నరేంద్ర మోడీని చూసి తెలుసుకోవచ్చునని ఎద్దేవా చేసింది.