జమిలి కహానీ: ఒక దేశం ఒకే ఎన్నికపై చర్చజరగాలన్న ప్రధాని మోడీ
నీతిఆయోగ్ నాలుగవ సమావేశంలో మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సారి ఎన్నికలు జరగాలనే అభిప్రాయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా జమిలిపై చర్చ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటూ కేంద్రం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఒకే సారి ఎన్నికలు వస్తే సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని చాలా మంది అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు మెజార్టీ విపక్ష పార్టీల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఒకే సారి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇది సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని చెబుతున్నారు.
ఒకే సారి ఎన్నికల నిర్వహణకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. గతేడాది నీతిఆయోగ్ సమావేశంలో జమిలిపై ప్రస్తావన వచ్చినప్పుడు... ఒకే సారి ఎన్నికల నిర్వహించడంవల్ల అప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలకు అంతరాయ ఏర్పడదని సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే ఈ ఆలోచనకు చాలా తక్కువ మంది నుంచి మద్దతు లభించింది.
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో మరోసారి జమిలి ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే సారి ఎన్నికలు జరగడంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రధాని.... ఇలా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం తగ్గడంతో పాటు వనరులను సక్రమంగా వినియోగించుకున్నట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని లేవనెత్తిన జమిలి ఎన్నికల అంశంపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... యావత్ దేశం ఎప్పుడూ ఎన్నికల మూడ్లోనే ఉందని ప్రధాని గ్రహించినట్లు చెప్పారు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని ఆయన అన్నారు. ఎలాంటి ఎన్నికలకు అయినా సరే ఒకటే ఓటర్ లిస్టు ఉండాలని రాజీవ్ కుమార్ సూచించారు.