Modi-Putin meet : ఢిల్లీలో మోడీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు- బంధంలో ఎలాంటి మార్పూ లేదన్న ప్రధాని
21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇవాళ భారత్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ప్రారంభించారు. ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ .. కరోనా తో ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం-రష్యా సంబంధాల వృద్ధి వేగంలో ఎలాంటి మార్పు లేదన్నారు.. మా ప్రత్యేక మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందన్నారు.
గత కొన్ని దశాబ్దాలలో, ప్రపంచం అనేక ప్రాథమిక మార్పులను చూసిందని మోడీ తెలిపారు. వివిధ రకాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయన్నారు అయితే భారతదేశం, రష్యాల మధ్య స్నేహం మాత్రం స్థిరంగా ఉందన్నారు.
భారత్, రష్యా మధ్య బంధం వాస్తవంగా దేశాంతర స్నేహానికి ఓ ప్రత్యేకమైన, నమ్మదగిన నమూనా అని మోడీ అభివర్ణించారు.భారత్ పట్ల మీ ప్రేమ చాలా స్పష్టమైనదని పుతిన్ ను ఉద్దేశించి మోడీ తెలిపారు. కోవిడ్, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం-రష్యా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు.
దీనిపై స్పందించిన పుతిన్.. మేము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, కాల పరీక్షకు తట్టుకున్న మిత్రదేశంగా భావిస్తున్నామని తెలిపారు. మన దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్తుపై తాను ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
మోడీ-పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలలో సహకారాన్ని మరింత పెంచడానికి భారత్, రష్యా పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. 2019లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ భేటీ అవుతున్న తొలి సమావేశం ఇదే.
Recommended Video
ఇవాళ మధ్యాహ్నం భారత్-రష్యా విదేశాంగమంత్రులు జైశంకర్, సెర్గీ లావ్ రోవ్, అలాగే రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సెర్గీ షోయిగూతో భేటీ అయ్యారు. ఇరు జంటలూ భారత్-రష్యా మధ్య ఆర్ధిక, తీవ్రవాద, సరిహద్దు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఇందులోనే చైనా నుంచి భారత్ కు ఎదురవుతున్న సవాళ్లను విదేశాంగమంత్రి జైశంకర్ రష్యా మంత్రికి వివరించారు. మాకు, భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని తెలిపారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గొప్ప విశ్వాసం, విశ్వాసంతో కూడిన సంబంధాన్ని పంచుకున్నారని జైశంకర్ వివరించారు. మేము ఈ సదస్సు నుంచి చాలా ముఖ్యమైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.