థెరీసా మేతో భేటీ: మాల్యా విషయాన్ని ప్రస్తావించిన మోడీ
లండన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రి థెరీసా మేతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారాల గురించి చర్చించుకున్నారు. వారి చర్చల మధ్యలో బ్యాంకులకు రూ.9వేల కొట్లు ఎగ్గొట్టి పరారైన విజయ్ మాల్యా ప్రస్తావనను మోడీ తీసుకొచ్చినట్లు తెలిసింది.
మాల్యా అంశాన్ని థెరీసా దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మాల్యాను భారత్కు రప్పించే అంశంపై చర్చలు జరిగాయని సమాచారం. దీనిపై ఆమె స్పందన మాత్రం తెలియరాలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత అయిన మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.9,000కోట్లు రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ఆయన 2016మార్చిలోనే భారత్నుంచి పారిపోయి వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారు. అప్పుడప్పుడూ అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్లనూ వీక్షించడానికి స్టేడియాలకు వస్తున్నారు మాల్యా.