జనాదరణలో మోడీయే టాప్.. ఆమడ దూరంలో రాహుల్!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి భారత రాజకీయాల్లో తిరుగులేని జనాదరణ పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్యూ’ రిసెర్చ్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి భారత రాజకీయాల్లో తిరుగులేని జనాదరణ పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప్యూ' రిసెర్చ్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
Recommended Video
ప్రజాదరణ అంశంపై ర్యాంకులు ఇవ్వాలని కోరుతూ ఈ సంస్థ చేసిన సర్వేలో 88 శాతం మంది మోడీనే సమర్ధించగా, రాహుల్ గాంధీకి 58 శాతం ఓట్లే వచ్చాయి. మొత్తం 2,464 మంది భారతీయులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
పదింట తొమ్మిది మంది మోడీకే సానుకూలం...
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో 9 మంది మోడీ నాయకత్వం పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. 2015 తరువాత ఉత్తరాదిలో మోడీ ప్రజాదరణలో పెద్దగా మార్పు రాలేదని, పశ్చిమ రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందని పేర్కొంది.
మూడు, నాలుగు స్థానాల్లో.. సోనియా, కేజ్రీవాల్
ప్యూ సర్వేలో రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలవగా ఆ తరువాతి స్థానాల్లో రాహుల్ గాంధీ నిలిచారు. ఈ సర్వేలో మోడీని 88 శాతం మంది సమర్థించగా, రాహుల్ గాంధీని 58 శాతం మందే సమర్థించారు. ఇక రాహుల్ తర్వాత 57 శాతం ఓటింగ్తో సోనియా గాంధీ, 39 శాతం ఓటింగ్తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని సర్వే తెలిపింది.
ప్రతి పది మందిలో ఏడుగురు సంతృప్తి...
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య ఈ సర్వేను నిర్వహించినట్లు ప్యూ రిసెర్చ్ తెలియజేసింది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది భారత ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తోందని అంగీకరించారు. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని 30 శాతం మంది యువకులు వెల్లడించారు. 2014 ఎన్నికల నాటితో పోలిస్తే.. ఇప్పుడు దేశ పరిస్థితి బాగుందని చెప్పిన వారి సంఖ్య 19 శాతం అధికమని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. మొత్తం మీద ప్రతి పదిమందిలో ఏడుగురు దేశాభివృద్ధి, పాజిటివ్ సెంటిమెంట్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
అమెరికాపై సానుకూలత తగ్గింది...
అమెరికాపై సానుకూల వైఖరి వ్యక్తంచేసిన భారతీయులు సంఖ్య తగ్గిపోయింది. 2015లో 70 శాతంగా ఉన్న ఇది 2017 నాటికి 49 శాతానికి పడిపోయింది. కేవలం 40 శాతం మంది మాత్రమే డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాలను సమర్ధించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంతో పోల్చుకుంటే ఇది 34 శాతం పడిపోయింది.
చైనా పట్ల కూడా...
చైనా పట్ల కూడా భారతీయులు తమ వైఖరి మార్చుకున్నారు. 2014లో 41 శాతం మంది చైనాకు అనుకూలత వ్యక్తం చేస్తే, 2017 నాటికి ఇది 26 శాతానికి తగ్గిపోయింది. డొక్లామ్ ప్రతిష్ఠంభన కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని అంచనా. ఇక మతపరమైన హింస విషయానికొస్తే.. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే దీనిని పెద్ద సమస్యగా పేర్కొన్నారని ప్యూ సర్వే పేర్కొంది.