మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని, ప్రియాంక గాంధీ వల్ల ఏమీ కాదు!: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అలాగే, టాప్ పోస్ట్ (ప్రధానమంత్రి)కు తమ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అర్హుడు కాదని చెప్పడం కూడా సరికాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రభావం అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్లోను ఆ ప్రభావం ఉండదని జోస్యం చెప్పారు.
ప్రియాంక గాంధీ మేజిక్ చేయలేరు
ఎవరి చేతిలోను మంత్రదండం లేదని, లోకసభ ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం ఉందని, ఇంతలో ఆమె (ప్రియాంక గాంధీ) ఏదో తిప్పేస్తారని భావించలేమని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అదే సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి పాపులర్ ఫేస్ అని చెప్పారు. కానీ ముందుముందు ఆమె ఎన్డీయేకు సవాల్గా మారుతారని అభిప్రాయపడ్డారు.
మళ్లీ నరేంద్ర మోడీయే
2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నితీశ్ కుమార్ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండరని తేల్చి చెప్పారు. బీజేపీకి పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీశ్ అభ్యర్థిత్వం సాధ్యం కాకపోవచ్చునని అన్నారు. నితీశ్ కుమార్ ఎన్డీయేలో ఒక పెద్ద నేత అని, బీహార్ లాంటి రాష్ట్రాన్ని పదిహేనేళ్ల పాటు పాలించిన ఘనత ఆయనకు ఉందని చెప్పారు. అయితే ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయనను ఊహించుకోవడం సమంజసం కాదన్నారు. మోడీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచి మోదీ తిరిగి ప్రధాని పదవి చేపడతారన్నారు.
శివసేనను కలవడంపై
గత సెప్టెంబరులో జేడీయూలో చేరిన ప్రశాంత్ ఇటీవల శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాకరేను ముంబైలో కలవడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో శివసేనకు వ్యూహకర్తగా పనిచేయడం అసాధ్యమన్నారు. ఒక పార్టీలో సభ్యునిగా ఉంటూ మరో పార్టీకి పనిచేయడం కుదరదని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. అనంతరం జేడీయూకు కూడా తన వ్యూహాలను అందించారు. ఏపీలో వైసీపీకి సేవలు అందించారు. అనంతరం జేడీయూలో చేరారు.