భయపెట్టి పాలించాలనుకుంటున్నారు: మోడీపై మమత ధ్వజం..కనిమొళికి అండగా నిలిచిన దీదీ
కోల్కతా: తనను వ్యతిరేకిస్తున్న పార్టీల నేతలపై ఐటీ ప్రధాని మోడీ ఐటీని ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు టీఎంసీ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంటిపై ఐటీ దాడులను ప్రస్తావించిన మమతా బెనర్జీ ఆమెకు అండగా నిలిచారు. దక్షిణ భారతంలో బీజేపీ వేర్పాటు రాజకీయాలను డీఎంకే వ్యతిరేకించింనందునే కనిమొళిపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు దిగారని దీదీ మండిపడ్డారు. మోడీ దేశాన్ని భయంతో పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.
మోడీలాంటి ప్రధానిని దేశచరిత్రలో ఎప్పుడూ చూడలేదని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అంటే అంతా గౌరవించాలని, ప్రేమించాలని చెప్పిన మమతా... మోడీ మీద ఈ రెండూ దేశప్రజలకు లేవని అన్నారు. కేంద్ర సంస్థలను వినియోగించి ప్రతిపక్ష నేతలపై మానసికంగా దాడి చేస్తోందని బీజేపీపై నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ. ఇందుకు నిదర్శనం బీజేపీని వ్యతిరేకిస్తున్న డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళిలను మానసిక వేదనకు గురిచేయడమే అని ఫైర్ అయ్యారు ఫైర్బ్రాండ్.
ఇదిలా ఉంటే గురువారం రోజున తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో కనిమొళి ఇంట్లో ఎన్నికల సంఘం నేతృత్వంలోని ఐటీ దాడులు నిర్వహించింది. తూత్తుకుడి నుంచి కనిమొళి బరిలో ఉన్నారు. తూత్తుకుడిలో కనిమొళిపై బీజేపీ నుంచి తమిళిసాయి సౌందర్రాజన్ పోటీచేస్తున్నారు. తమిళిసాయి ఓడిపోతున్నారన్న సంగతి తెలుసు కాబట్టే మానసికంగా కనిమొళిని బీజేపీ టార్గెట్ చేసిందని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు.