ప్రజల్లో భయాందోళనలు నింపిన మోదీ : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపుతున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 132వ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: ప్రధాని మోదీ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపుతున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 132వ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఏ వ్యక్తి కోసమో, ఏ కొందరి కోసమో పనిచేసే పార్టీ కాదన్నారు. తమ పార్టీ అందరికోసం పని చేసే పార్టీ అని, అదే సమయంలో అందరు చెప్పేది కాంగ్రెస్ వింటుందని.. కానీ బీజేపీ విషయానికొస్తే అది మోదీ ఒక్కరిదేనని, అక్కడ మోదీ చెప్పిందే అందరూ వింటారని ఎద్దేవా చేశారు. మోదీ తీసుకునే నిర్ణయాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు.
ప్రధాని మోదీ కూడా తనకు ఏదనిపిస్తే అదే చేస్తారని, ఇతరుల గురించి పట్టించుకోరని, ప్రజల గురించి అసలే పట్టించుకోరని, ఇందుకు పెద్ద నోట్ల రద్దు అంశమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజల కష్టార్జితం అపహరణకు గురవుతోందని, వారి సొత్తు వారికి కాకుండా చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు.
ప్రధాని నోరు తెరిస్తే అవినీతిపై పోరు అని మాట్లాడతారని, సహారా, బిర్లా డైరీల ద్వారా వెలుగులోనికి వచ్చిన అవినీతి బాగోతం గురించి ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పరని అన్నారు. మోదీ దూకుడు, హింస, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆయన దూకుడుతనపు నిర్ణయాల పర్యవసానాన్నే ఇప్పుడు దేశ ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు. ఏ నియమాల ప్రకారం ప్రధాని ప్రజలపై ఆంక్షలు విదిస్తున్నారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.