నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోలేదు..మోడీవి పసలేని ఆరోపణలు: సంజయ్గాంధీ హాస్పిటల్
గ్వాలియర్ : ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేసేందుకు అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ నిరాకరించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు ఆ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ ఎస్ఎం చౌదరి. అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్కు ట్రస్టీలుగా గాంధీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్కడ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేసుకోవచ్చు. చికిత్సకోసం వచ్చిన ఓ వ్యక్తి సమయానికి వైద్యం అందక మృతి చెందడంతో వివాదం రాజుకుంది.
బాధ్యతారాహిత్యంతో వ్యవహిరించిన వైద్యులు
అమేథీలోని సంజయ్గాంధీ ఆస్పత్రికి ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేయించుకునేందుకు ఓ కుటుంబం వచ్చింది. వైద్యం అందక పేషెంట్ మృతి చెందడంతో ఈ విషయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లింది. గ్వాలియర్లోని ఓ సభలో మాట్లాడిన మోడీ ఘటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ ఆయుష్మాన్ పథకం ఉన్నప్పటికీ వైద్యులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి నిండుప్రాణాలను తీశారని మండిపడ్డారు. అయితే మోడీ ఆరోపణల్లో నిజం లేదని అన్నారు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ఎస్ఎం చౌదరి. దీనిపై స్పందించిన మెడికల్ డైరైక్టర్... పేషెంట్ హాస్పిటల్కు రాగానే మృతి చెందినట్లు చెప్పారు. అయితే హాస్పిటల్ను రాజకీయాలతో ముడిపెట్టరాదని ఎస్ఎం చౌదరి విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రి అందరికీ చికిత్స అందిస్తామని దీనిపై రాజకీయంగా, మతపరంగా, కులపరంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
చికిత్స చేసేందుకు ఇది మోడీ హాస్పిటల్ కాదు
ఆయుష్మాన్ పథకం కింద ఇప్పటి వరకు 200 మందికి చికిత్స చేసినట్లు సంజయ్ గాంధీ ఆస్పత్రి డైరెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తించేందుకు ఇది మోడీ హాస్పిటల్ కాదని హాస్పిటల్ సిబ్బంది చికిత్సకు వచ్చిన పేషెంట్తో చెప్పినట్లు మోడీ అన్నారు.
మృతుడి బంధువుల ఆవేదన వీడియోను ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ
చికిత్స కోసం అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్కు వెళితే వైద్యం చేసేందుకు నిరాకరించడంతోనే తన బంధువు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మృతుడి బంధువు వీడియోను అమేథీ బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు. ఇక గ్వాలియర్లో ప్రసంగించిన ప్రధాని మోడీ ... కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. భారత్లో ఉన్న పేదరికాన్ని కాంగ్రెస్ ప్రపంచదేశాలకు పరిచయం చేస్తోందని తమ ప్రభుత్వం భారతదేశం యొక్క పవర్ను ప్రపంచానికి చూపిస్తోందని అన్నారు.అంతేకాదు నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అంచున ఉన్నట్లు ఎన్నికల ట్రెండ్స్ చెబుతున్నాయని మోడీ అన్నారు. దేశ ప్రజలు తనపై విశ్వాసం ఉంచారని అందుకే వారికి కృతజ్ఞత తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు మోడీ. కానీ విపక్షాలకు మాత్రం తనపై నమ్మకం లేదని కేవలం తనను దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు.
ప్రజలు మళ్లీ మోడీ ప్రభుత్వం కావాలని అంటున్నారు
మోడీ హఠాఓ అనే నినాదంతో విపక్షాలు ముందుకెళుతున్నాయని చెప్పిన ప్రధాని.... తమ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన మెజార్టీ ప్రజలు మళ్లీ మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని సభలో చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం దేశంలో నక్సలిజం, ఉగ్రవాదం పెరిగిపోయాయని ధ్వజమెత్తిన ప్రధాని... త్వరలోనే నదులు సముద్రజలాలను అనుసంధానం చేసేందుకు జలశక్తి పేరుతో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని అన్నారు.