అంతా 'సూట్ బూట్' వ్యవహారం.. సామాన్యుల గురించి ప్రధానికి పట్టదు : మోదీపై రాహుల్ విమర్శలు
ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్పై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆర్థికవేత్తలు,పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు,పలు రంగాలకు చెందిన ప్రముఖలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా విమర్శలు గుప్పించారు.
మోదీ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సంప్రదింపుల సమావేశం క్రోనీ కేపిటలిస్టులు, సంపన్నుల ప్రయోజనాల కోసమే జరిగిందని రాహుల్ ఆరోపించారు. రైతులు,విద్యార్థులు,యువత,మహిళలు,ప్రభుత్వ&పీఎస్యూ ఉద్యోగులు,చిన్న పారిశ్రామికవేత్తలు,మధ్యతరగతి ట్యాక్స్ చెల్లింపుదారుల అభిప్రాయాలు,ప్రయోజనాలపై దృష్టి సారించే ఉద్దేశం ప్రధాని మోదీకి లేదని విమర్శించారు. #SuitBootBudget అనే హాష్ట్యాగ్తో రాహుల్ ట్విట్టర్లో ఈ పోస్టు చేశారు. రెండు రోజుల క్రితం చేసిన మరో ట్వీట్లోనూ ప్రధాని మోదీ,కేంద్రమంత్రి అమిత్ షాలను రాహుల్ విమర్శించారు. దేశాన్ని క్రోనీ కేపిటలిస్టులకు అమ్మేందుకే ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ నిరుద్యోగాన్ని పెంచుతూ,ప్రజా వ్యతిరేక,కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
కాగా, మునుపెన్నడూ లేనంత ఆర్థిక మందగమనాన్ని భారత్ ఎదుర్కొంటోందన్న ఆర్థికవేత్తల సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు,పారిశ్రామికవేత్తలు,వాణిజ్యవేత్తలు,బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి వారి నుంచి విలువైన సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదాపు 40 మంది ప్రతినిధుల వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే నిర్మలా సీతారామన్ కొద్ది నెలల నుంచే ఆర్థికవేత్తలతో సమావేశాలు జరుపుతున్నారని, తాజా సమావేశానికి హాజరుకాలేనని ప్రధాని కార్యాలయానికి ముందు గానే సమాచారం అందించారని కేంద్రమంత్రి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.
Modi's "most extensive" budget consultation ever, is reserved for crony capitalist friends & the super rich. He has no interest in the views or voices of our farmers, students, youth, women, Govt & PSU employees, small businessmen or middle class tax payers. #SuitBootBudget pic.twitter.com/6VP2g9OyNT
— Rahul Gandhi (@RahulGandhi) January 10, 2020