మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్
''ఎల్వోసీ(నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వరకు .. భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారికి గట్టి బదులు ఇచ్చాం.. ప్రత్యర్థులకు అర్థమయ్యే గట్టి భాషలోనే మన జవాన్లు సమాధానం చెప్పారు. లదాక్ లో జరిగిన సంఘటనలతో మన సైన్యం ఏం చేయగలదో ప్రపంచానికి తెలిసొచ్చింది''అంటూ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పంద్రాగస్టు ప్రసంగం వట్టి డొల్ల అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
గాల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్ల మృతి, ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణ అంశాలను గుర్తుచేస్తూ ప్రధాని మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''మన సైనికుల వీరత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ఒక్క ప్రధాని మోదీకి తప్ప. ఆయన పిరికి తనం కారణంగానే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. అదే డ్రాగన్ దేశానికి బలంగా మారింది'' అని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..
గాల్వాన్ లోయలో ఘర్షణలు, చైనా దురాక్రమణ, డ్రాగన్ దేశంతో సంబంధాలపై కేంద్రం అన్నీ అబద్దాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నదని, ప్రధాని తన పంద్రాగస్టు ప్రసంగంలోగానీ, అంతకుముందు ప్రకటనల్లోగానీ కనీసం చైనా పేరెత్తడానికి కూడా వణుకుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రత విషయంలో మోదీ సర్కారును ప్రజలు ప్రశ్నించాలన్నారు.
Recommended Video
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మే మొదటి వారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 15న గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత, సైనిక, దౌత్య చర్చల్లో బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరినప్పటికీ, చైనా సైన్యాలు తిష్టవేసుకుని కూర్చోవడం, కొత్త ప్రాంతాల్లో మోహరింపులు పెంచడం లాంటి దూకుడు చర్యలకు పాల్పడుతున్నది. అయితే, కేంద్రం మాత్రం సరిహద్దులో అంతా బాగుందని చెబుతుండటం, ప్రతిపక్షాలు ఆ వాదనను తప్పుపడుతుండటంతో అసలేం జరుగుతోందనేదానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.