గో డిజిటల్ : ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం
Recommended Video
కేంద్రప్రభుత్వం అధీనంలో నడిచే ప్రసారభారతి ఛానెల్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్లతో జతకట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ రంగాన్ని ప్రమోట్ చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆగష్టు 15న గూగుల్లో ఇండిపెండెన్స్డే స్పీచ్ అని సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే గూగుల్ హోమ్పేజ్ పైనే ప్రధాని మోడీ ప్రసంగం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. యూట్యూబ్కెళ్లి అక్కడ డీడీ అని టైప్ చేసి వీక్షించాల్సి ఉండేది.ఇప్పుడు దానికి స్వస్తిపలికినట్లయ్యింది. గూగుల్తో డీడీ జతకట్టాక ఇది మరింత సులభతరం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభ ఉపన్యాసంలో కూడా ఇదే తరహాను అవలంబించారు. నరేంద్ర మోడీ యాప్పై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి పలు ఐడియాలు పంపాల్సిందిగా ఇప్పటికే దేశప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రసంగం మంగళవారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రసంగాన్ని ఆలిండియా రేడియోతో పాటు అన్ని దూరదర్శన్ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. హిందీ, ఇంగ్లీషు దూరదర్శన్ ఛానెళ్లతో పాటు ఇతర ప్రాంతీయ దూరదర్శన్ ఛానెల్లో కూడా కోవింద్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఆలిండియా రేడియో రాష్ట్రపతి ప్రసంగం ప్రాంతీయ నెట్వర్క్లపై రాత్రి 8 గంటలనుంచి టెలికాస్ట్ చేస్తాయి.
కొన్ని తరాల వారు దూరదర్శన్తో మమేకమయ్యారు. దూరదర్శన్లో వస్తున్న కార్యక్రమాలనే తిలకిస్తూ పెరిగిన వారు కూడా ఉన్నారు.కాలం మారుతున్న కొద్దీ సామాజిక, సంప్రదాయాలపై అవగాహన కల్పించి ప్రజల మన్ననలను చూరగొంది దూరదర్శన్. అయితే 2000వ సంవత్సరం నుంచి టీవీ రంగంలో ప్రైవేట్ ఛానెళ్లు అరంగేట్రం చేయడంతో దూరదర్శన్ కొంత వెనకబడింది. వెనకబడినప్పటికీ... ప్రజల్లో మాత్రం మంచి ముద్ర వేసుకుంది. అయితే ఈ గ్యాప్ను మొత్తం పూరించేందుకు సరికొత్త హంగులతో క్షేత్రస్థాయిలో సమూల మార్పులు చేసి ప్రజలముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే దూరదర్శన్ గత ఏడాదిగా డిజిటల్ రంగంలో కూడా తన సత్తాని చాటుకుంటోంది. ఇప్పటికే 37 యాక్టివ్ యూట్యూబ్ ఛానెల్స్, 250 ట్విటర్ హ్యాండిల్ కలిగి ఉన్నాయి. ఇక జాతీయ వేడుకలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాన్ని టెలికాస్ట్ చేసేందుకు ఇంతకంటే పెద్ద వేదిక ఉండదని దూరదర్శన్ భావిస్తోంది.
గతేడాది జరిగిన స్వాతంత్ర్య వేడుకలు, గణతంత్ర వేడుకల్లో డిజిటల్ ప్రసారాల ద్వారా డీడీకి ఒక మిలియన్ వ్యూస్, గణతంత్ర వేడుకలరోజు మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు స్వాతంత్రవేడుకలు జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు లేకుండా ఉండవు. వీటినే ప్రసారం చేస్తూ దీంతో పాటు ... స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర గురించి ప్రసారాలు చేయడం, శంకర్ మహదేవన్ గొంతు నుంచి జారువాలిన దేశభక్తి గీతాలను ప్రసారం చేయడం ద్వారా మరింత కొత్తదనం తీసుకురానుంది. మరోవైపు యువత మొత్తం స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నందున ఒక మొబైల్ యాప్ కూడా దూరదర్శన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది సమయం తీసుకునేలా కనబడుతున్న నేపథ్యంలో ఆలిండియా రేడియో యాప్ ద్వారా శ్రోతలు స్వాతంత్ర్య దినోత్సవ పూర్తి వేడుకలను వినే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగం కూడా ఈ యాప్ ద్వారా వినొచ్చు. ప్రసార భారతి ఏదైతే టెలికాస్ట్ చేస్తుందో... అన్నీ ఆలిండియా రేడియో యాప్ ద్వారా వినొచ్చని అధికారులు తెలిపారు.