ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలైన హిమాలయాల్లో తనను తాను అన్వేషించుకున్న నరేంద్రమోడీ
మనం సాధారణ మానవమాతృలం. మన జీవితంలో చాలా సందర్భాల్లో మన మీద నమ్మకం ఉండదు. ఇలాంటి సందర్భాలు అనేకం. మన ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. మనం తీసుకునే నిర్ణయాల్లో నిలకడ ఉండదు. జీవితకాలంలో లక్ష్యాలను అందుకోలేనంతటి కఠిన సవాళ్లు ఎదురవుతుంటాయి. మనకు సరైన మార్గదర్శకం ఉండదు. ఇలాంటి సంఘటనలు ఏ ఒక్కరికో పరిమితం కాదు. అత్యున్నత స్థాయిలో ఉన్నవారైనా సరే! జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటారు.
"నా కష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది" తన జీవిత ప్రయాణం గురించి వివరించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జీవితం అంటే ఏమిటి? దీని ఉద్దేశమేంటీ? అనే ప్రశ్నలు నరేంద్రమోడీని వెన్నాడాయి. తన 17వ ఏటే ఆయన తనను వేధిస్తున్న, వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. 17 సంవత్సరాల వయస్సులో నాకు ఏమీ తెలిసేది కాదు. జీవితంపై స్థిర నిర్ణయాలను తీసుకోవడం తెలియదు. సరైన మార్గం తెలియదు. నేను తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉండేది కాదు. అస్పష్టత వెంటాడేది.. అని ప్రధాని హ్యూమన్స్ బోంబే ప్రతినిధులతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. నా దారి ఏమిటో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఎటు వెళ్లాలో కూడా తెలియదు. నేనేం చేయాలి? ఎందుకు చేయాలి? నాకేం కావాలి? ఎందుకు కావాలి? అనే ఆలోచించే వాణ్ణి. కానీ, చివరికి అంతా తెలుసుకున్నాను. ఏదో సాధించాలని నిర్ధారించుకున్నాను. నాకేం కావాలో తెలుసుకోలిగాను.. అని మోడీ చెప్పారు.
దిశానిర్దేశం లేకుండా, సరైన మార్గం లేకుండా మనం ముందకు వెళ్తుంటాం. దాన్ని తెలుసుకోవడానికి మనం రోడ్డు మీదే రాకపోకలు సాగిస్తాం. మన జీవితం అనే ప్రయాణంలో మనం ఒక్కసారి కూడా తొంగి చూడం. ఏ అమెరికాకో లేకపోతే..ఏ దేశీయంగా పర్యాటక ప్రాంతానికో వెళ్లి వస్తుంటాం. ఈ ప్రయాణంతోనే ఆత్మ సంతృప్తిని సాధించామని భావిస్తాం. నరేంద్రమోడీ అలా అందరిలా ఆలోచించలేదు. కారు ప్రయాణాలను ఇష్ట పడలేదు. స్నేహితులతో కాలక్షేపం చేయలేదు. అమెరికా వంటి పర్యాటక కేంద్రాలకు వెళ్లలేదు. ఆత్మ సంతృప్తిని, జీవిత సారాంశాన్ని తెలుసుకోవడానికి తన యుక్త వయస్సులో ఆయన ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలుగా మనం గౌరవించే హిమాలయ పర్వత శ్రేణులను ఎంచుకున్నారు. నేను సుదూరంగా, విస్తృతంగా నా ప్రయాణాన్ని సాగించాను. రామకృష్ణ మిషన్ లో చాలా రోజులు గడిపాను. సాధువులను కలిశాను. వారితో ఎక్కువ కాలం గడిపాను.సాధు, సంతువులతో పెద్ద సంఖ్యలో కలిశాను. నాలో నేను అన్వేషణ ఆరంభించాను..అని మోడీ చెప్పారు.
మనం స్నానం చేయడానికి వేడినీళ్లను వాడతాం. వేడి నీళ్లు ఉంటే చాలు. వీడు గంటల కొద్దీ షవర్ కిందే ఉంటాడు.. అని మన స్నేహితులు, మనతో పాటు గదిని పంచుకునే వారు..వెక్కిరిస్తారు. యుక్త వయస్సులో ఇలాంటి సంఘటన దాదాపు మనందరికీ ఎదురయ్యే ఉంటుంది. నరేంద్రమోడీ అలాక్కాదు. వేడినీళ్ల స్నానాన్ని ఆశించలేదు. షవర్ కింద గంటల కొద్దీ కూర్చుని స్నానాన్నీ ఆచరించలేదు. హిమాలయా పర్వత శ్రేణుల గుండా ప్రవహించే గడ్డ కట్టించే, వెన్నులో వణకు పుట్టించేంతటి చలి ప్రదేశాల్లో, హిమానీ నదుల్లో తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్నానం ఆచరించే వారు. గలగలమంటూ ప్రవహించే నదీజలాల చిరు శబ్దంలో, శాంతి, ఏకత్వం, ధ్యానం, అనే విషయాలను తెలుసుకోవచ్చు.. అని మోడీ సూచించారు. చన్నీటి స్నానంలో వేదాంత జ్ఞానాన్ని, జీవిత సారాంశాన్ని మనం నేర్చుకోవచ్చు. పరోపకారార్థం ఇదం శరీరం అనే సూక్తిని తెలుసుకోవచ్చని మోడీ వెల్లడించారు.
తన జీవతాన్ని పరుల సేవలోనే గడిపేయాలని నరేంద్రమోడీ యుక్త వయస్సులోనే నిర్ణయించుకున్నారు. సైన్యంలో పనిచేయాలనీ భావించారు. కొన్ని సంఘటనలు, కొందరు సాధువులతో చర్చల అనంతరం మోడీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అప్పటిదాకా కొనసాగించిన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న అనుభవాలు, పాఠాల ప్రభావమే ఇప్పుడు మనం చూస్తున్న, మన ముందు ఉన్న నరేంద్రమోడీ.
నా యుక్త వయస్సులో నేను నేర్చుకున్న జీవిత పాఠాలు, తెలుసుకున్న జీవిత సత్యాలు, అప్పటి అనుభవాలు..నన్ను ఇప్పటికీ ఎదగడానికి సహకరిస్తున్నాయి. మన ఆలోచనలు, మన పరిమితులకు లోబడి ఉన్నామనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. వాటన్నింటినీ ఒక్కసారి పక్కన పెట్టి చూడండి. ఆలోచనలను విస్తరించి చూడండి. విస్తృతత్వం అనే ప్రపంచం ఎదురుగా ఒక్కసారి నిల్చోండి. ఈ విశాల విశ్వం ముందు మనం నీటి బిందువు అనే విషయం మనకు తెలిసిపోతుంది. విస్తృతం అనే విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీలో మీరు వెదుక్కోండి. అన్వేషించుకోండి. అప్పుడే అసలు జీవితం ఆరంభమౌతుంది. అప్పుడే మార్పు మొదలవుతుంది.. అని మోడీ వెల్లడించారు. జీవితం తెలుసుకోవడానికి ప్రయాణాన్ని మొదలు పెట్టిన రెండేళ్ల తరువాత సంపూర్ణమైన స్పష్టతతో, సరికొత్త శక్తి, ఉత్సాహంతో నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను.. అని మోడీ చెప్పారు.
తనను తాను తెలుసుకోవడానికి, తనను తాను అర్థం చేసుకోవడానికి మోడీ మొదలు పెట్టిన ప్రయాణం.. మన ఆలోచనలు, పరిమితులపై ప్రభావం చూపుతుంది. వాటిని ఛిన్నాభిన్నం చేస్తుంది. తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏమిటో చెప్పకనే చెబుతుంది. మనం కూడా ఒక్కసారి ఆ తరహా ప్రయాణాన్ని మొదలు పెడితే.. అత్యున్నత శిఖరాలను అందుకోవడంలో ఏ శక్తీ మనకు అడ్డు పడదు. వెల కట్టలేని కీర్తిని మూటగట్టుకోవచ్చు. మోడీ సాధించిన అద్భుత విజయాలను మనమూ అందుకోవచ్చు. హ్యూమన్స్ ఆఫ్ బోంబేకు ఇచ్చిన అయిదు భాగాల ఇంటర్వ్యూలో మోడీ వెల్లడించిన అంతర్ముఖ విషయాలు మన ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఎనిమిదేళ్ల వయస్సులోనే గుజరాత్ వరద బాధితులకు ఎనలేని సహాయాన్ని అందించిన మోడీ.. 17 ఏళ్ల వయస్సు నాటికి ఎవరూ వేలెత్తి చూపని విధంగా జీవితాన్ని మార్చుకోగలిగారు.