మోదీ అబద్దాలకు కాలం చెల్లింది..! కాంగ్రెస్, బీజేపి వల్ల పేదలకు న్యాయం జరగదన్న మాయావతి..!!
లక్నో/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మరో సారి నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆమె స్పష్టం చేసారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి, దేశ భవిష్యత్ కోసమే మళ్లీ ఎస్పీ - బీఎస్పీ చేతులు కలిపామని వివరణ ఇచ్చారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ యాదవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలు ములాయం తమ నాయకుడిగా భావిస్తున్నాయని మాయావతి చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సమర్థులు, అసమర్థులు ఎవరో గుర్తించి ప్రజలు ఎన్నుకోవాలని మాయ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆలోచిస్తాయని, వెనుకబడిన వర్గాల కోసం మోదీ చేసిందేమీ లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ నాటకాలు, అబద్ధాలు చెల్లవు అని మాయావతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని, దేశ వ్యాప్తంగా తిరుగుతూ, వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని హామీ ఇస్తుందని.
కానీ కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు న్యాయం జరగదని మాయావతి అన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు, వెనుకవడిన వర్గాలకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్సిస్తామని హామీ ఇస్తున్నానని మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని, ములాయం సింగ్కు సరైన వారసులు అఖిలేష్ యాదవే అని మాయావతి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.