ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా.. మోడీ ప్రమాణ స్వీకారం చూస్తూ అమ్మ మురిసింది
గాంధీనగర్ : తన కొడుకు దేశానికి రెండో సారి ప్రధాని కావడం చూసి ఎంతో ఆనందించింది ఆ తల్లి. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా వీక్షించలేకపోయిన తల్లి హీరాబెన్ టీవీలో మోడీ ప్రమాణ స్వీకారం చూసి ఆనందానికి గురైంది. దేశ ప్రజల మనసులను తన కొడుకు గెలుచుకున్నందుకు ఎంతో గర్వపడింది హీరాబెన్. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
గాంధీనగర్లోని తన ఇంట్లో మోడీ తల్లి హీరాబెన్ టీవీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించగానే ఇంట్లో టీవీ ముందు కూర్చుని చపట్లు కొట్టారు హీరాబెన్. తన కొడుకు మరోసారి హీరో అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీ సాధించడంలో మోడీ కృషి ఎంతగానో ఉంది. ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా తల్లిని కలవలేకపోయిన మోడీ... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన తల్లి హీరాబెన్ను కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.
హీరాబెన్ గాంధీనగర్లో మోడీ తమ్ముడు పంకజ్తో పాటు ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తల్లిని చూసి ఆమెతో 20 నిమిషాలు గడిపారు మోడీ. ఆ తర్వాత ఆమెకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోడీ వెళ్లారు. ఇక గురువారం రోజున రెండో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. అంతేకాదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలు కూడా హాజరయ్యారు.