పవార్కు మోడీ ఇచ్చిన ఆఫర్ ఏమిటి..? అదో పెద్ద కుట్రన్న శివసేన
న్యూఢిల్లీ: బీజేపీతో చేతులు కలపాల్సిందిగా ప్రధాని మోడీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు ఇచ్చిన ఆఫర్ ఒక కుట్రలో భాగమేనని శివసేన మాతృపత్రిక సామ్నా పేర్కొంది. శివసేన పార్టీకి ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసేందుకే బీజేపీ కుట్రపన్నిందని అభిప్రాయపడింది. శరద్ పవార్ పవర్ ఏమిటో ఎన్నికలకు ముందు ఎందుకు గ్రహించలేదని బీజేపీ అధినాయకత్వాన్ని శివసేన సామ్నా ద్వారా ప్రశ్నించింది.
ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కోసం పవార్ ఏం చేశారని అమిత్ షా ప్రశ్నించారని గుర్తు చేసిన శివసేన... పవార్ ఎన్నికల తర్వాత అమిత్ షా ప్రశ్నకు సమాధానం చెప్పారని చెప్పింది. మహారాష్ట్రకు పవార్ ఏమి చేయకపోతే ఆయన అనుభవంను మోడీ ఎలా వినియోగించుకోవాలని అనుకున్నారని శివసేన ప్రశ్నించింది. శరద్ పవార్ అనుభవం ఉన్న నేత అని దీన్ని గుర్తించేందుకు మోడీ-షాలకు ఐదున్నరేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించింది.
ప్రధాని నరేంద్ర మోడీతో తాను సమావేశమైనప్పుడు రెండు పార్టీలు కలిసి ఎందుకు పనిచేయకూడదని చెప్పినట్లు ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు. అకాల వర్షాలపై ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత రెండు పార్టీలు చేతులు కలిపితే బాగుంటుందని మోడీ చెప్పినట్లు పవార్ వెల్లడించారు. అయితే మోడీతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని అందులో ఎలాంటి మార్పు ఉండదని పవార్ చెప్పారు. అంతేకాదు జాతీయ అంశాలు వచ్చినప్పుడు మోడీకి అండగా నిలుస్తానని తాను చెప్పినట్లు పవార్ చెప్పారు. అయితే తన పార్టీ సిద్ధాంతాలు వేరు కాబట్టి బీజేపీతో కలవడం కుదరదని స్పష్టం చేసినట్లు పవార్ చెప్పారు.
ఇక ఛత్రపతి శివాజీ సిద్ధాంతాలపై పనిచేసే ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయాలనే మోడీ-షాలు కుట్రపన్నారని శివసేన సామ్నా ద్వారా ధ్వజమెత్తింది. మహారాష్ట్ర పవార్ అనుభవంను రుచిచూసిందని ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న వారు కూడా పవార్ పవర్ను తెలుసుకోగలిగారని శివసేన సెటైర్ వేసింది.