ఎన్నికల ముందు భారీ ఊరట: రాఫెల్ కొనుగోలులో మోడీ సర్కార్కు కాగ్ క్లీన్ చిట్
ఢిల్లీ: ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం. ఇప్పటికే సుప్రీం కోర్టు రాఫెల్ ఒప్పందంలో కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో విపక్షాలకు భారీ దెబ్బే తగిలింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాఫెల్కు సంబంధించి మరికొన్ని వివరాలు బయటపెట్టడంతో మళ్లీ నిప్పు రాజుకుంది. పార్లమెంటు ఉభయసభలను ఈ అంశం కుదిపేసింది. తాజాగా కాంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ కాగ్ కూడా రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకీ కాగ్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి...?
2.86శాతం తక్కువతోనే కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం
ఎన్నికలవేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ఉపశమనం కలిగించింది కాగ్ నివేదిక. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలు అంశంలో కాగ్ తన నివేదిక ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016లో రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయాలని చెప్పి ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపించింది. ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం 2.86శాతం తక్కువకే యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని పేర్కొంది. అంటే 2007లో కాంగ్రెస్ కోట్ చేసిన ధరకంటే 2.86శాతం తక్కువతోనే కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం జరిగిందని కాగ్ వెల్లడించింది.
పార్లమెంటు ముందుకు కాగ్ రిపోర్ట్
పార్లమెంటు సమావేశాలు చివరి రోజు కాగ్ ఈ నివేదిక సభముందు ఉంచింది. 2007లో యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందం కంటే 2.86శాతం తక్కువకే మోడీ సర్కార్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోందని వెల్లడించింది. 2016లో జరిగిన ఒప్పందంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిపాదనలు పక్కకు పెట్టడంతో ధరలు తగ్గిఉంటాయని కాగ్ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే రక్షణశాఖ కూడా నాటి యూపీఏ హయాంలో కోట్ చేసిన ధరకంటే 9శాతం తక్కువకే కొనుగోలు చేస్తున్నట్లు మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. ఇక కాగ్ నివేదిక ప్రకారం 2007లో ఎయిర్క్రాఫ్ట్ ఏధరకైతే యూపీఏ ప్రభుత్వం కొనుగోలు చేసిందో అదే ధరకే ఎన్డీఏ సర్కార్ కూడా కొనుగోలు చేసిందని వెల్లడించింది.
2016 ఒప్పందంలో ఎలాంటి గ్యారెంటీ ఇవ్వని దస్సో సంస్థ
2007లో యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందం ప్రకారం దస్సో సంస్థ విమానాల పర్ఫార్మెన్స్, ఆర్థికంగా గ్యారెంటీ కూడా ఇచ్చిందని పేర్కొన్న కాగ్... 25శాతం ఒప్పందంలో భాగమేఅని క్లారిటీ ఇచ్చింది. దీన్ని కూడా బేస్ ప్రైస్లోనే దస్సో సంస్థ చేర్చిందని వెల్లడించింది. 2016 ఒప్పందంలో మాత్రం ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదని స్పష్టం చేసింది కాగ్. ఇక్కడే దస్సో సంస్థకు చాలావరకు డబ్బులు మిగిలిపోయాయని దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కాగ్ వివరించింది. ఇదిలా ఉంటే మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కమిటీ ఈ ఒప్పందాన్ని మార్చి 27,2015లో తిరస్కరించినట్లు కాగ్ స్పష్టం చేసింది.