మోడీ వ్యాఖ్యలు , రైతుల డిమాండ్లు .. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రైతులతో కేంద్రం చర్చలపై ఉత్కంఠ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళనలు తెలియజేయడానికి లాంగ్ మార్చ్ నిర్వహించడానికి ప్రయత్నించిన రైతులపై పోలీసుల అణచివేత కు నిరసనగా దేశవ్యాప్త దుమారం రేగింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న రైతులు,ఢిల్లీ లోకి వెళ్ళే ప్రధాన రహదారులను దిగ్బంధిస్తున్నారు. ఆరునెలలైనా సరే అక్కడే ఉండి పోరాటం చెయ్యటానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారు .
5వ రోజు రైతుల ఆందోళన.. ఢిల్లీ దిగ్బంధనానికి పిలుపుతో టెన్షన్ .. మంత్రుల భేటీ
ఢిల్లీలో, ఢిల్లీ బోర్డర్ లో రైతుల ఆందోళన .. నేడు రైతులతో కేంద్రం చర్చలు
ఒకపక్క ఢిల్లీలోని బురారిలో నిరంకారీ గ్రౌండ్లో ఆందోళన కొనసాగిస్తూనే, మరోపక్క ఢిల్లీ లోపలికి వెళ్లే మార్గాలన్నింటినీ రైతులు తమ ఆందోళనలతో బ్లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకు పెరుగుతున్న ఆందోళనలు, ఢిల్లీలో విపరీతంగా ఉన్నచలి , కరోనా తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3వ తేదీన చర్చలు జరపాలని నిర్ణయించినప్పటికీ, ముందస్తుగా ఈరోజే రైతుల తో చర్చలు జరపడానికి నిర్ణయం తీసుకుంది.
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ రోజు చర్చలు
నేడు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ రోజు చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది.
చర్చకు ముందు ఈ ఉదయం బిజెపి చీఫ్ జెపి నడ్డా ఇంట్లో హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్తో సమావేశమై రైతులతో ఏ విషయాలపై చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ బోర్డర్ లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య 48 గంటల్లోపు అగ్ర బిజెపి నాయకుల మధ్య జరిగిన రెండవ సమావేశం ఇది.
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ ఢిల్లీలో చలి, మరోవైపు ఉన్న కరోనా వైరస్ కారణంగా నేడు చర్చలు నిర్వహించనున్నట్లు గా తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ లో చర్చలు
నవంబర్ 13 న, మేము డిసెంబర్ 3 న రైతులతో సమావేశమవుతామని చెప్పాము, కాని రైతులు నిరసన తెలిపే మానసిక స్థితిలో ఉన్నారు అని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ అన్నారు. ఢిల్లీలో చల్లగా ఉండటం, అలాగే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా మేము డిసెంబర్ 1 న మధ్యాహ్నం 3 గంటలకు కిసాన్ యూనియన్ అధిపతులను విజ్ఞాన్ భవన్ కు చర్చల కోసం ఆహ్వానిస్తున్నాము. నిరసనను వదిలి చర్చ ద్వారా పరిష్కారం కనుక్కుందాం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.
చర్చలకు హాజరవుతున్న 35 మంది రైతు ప్రతినిధులు
గత 6 రోజులుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు . ఈ రోజు ఉదయం రైతులతో చర్చలు జరుపుతామని పేర్కొన్న తరువాత రైతులు చర్చలకు హాజరవుతారని చెప్పారు. ముందస్తు షరతులు లేకుండా ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించిందని తాము చర్చలకు వెళుతున్నామన్నారు . సుమారు 35 మంది ప్రతినిధులు చర్చలకు వెళ్తారని చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తామని , ముఖ్యంగా మద్దతు ధరపై చట్టాన్ని డిమాండ్ చేస్తామన్నారు . ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే, నిరసనలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ జగ్జిత్ సింగ్ దల్లెవాల్ చెప్పారు.
వ్యవసాయ చట్టాలను సమర్ధించేలానే మోడీ వ్యాఖ్యలు
మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు వ్యవసాయ చట్టాలపై భయాలు , అనుమానాలు ఉండటం సహజమేనని, అయితే కేంద్ర ప్రభుత్వానికి రైతులను మోసగించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల అనుమానాలను నివృత్తి చేస్తామని, దశాబ్దాలపాటు సాగిన మోసపూరిత విధానాల వల్ల రైతులకు అనుమానాలు రావడం సహజం అంటూ పేర్కొన్నారు. కానీ రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామనే ఆలోచన కేంద్రానికి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న చర్చలు సత్ఫలితాలను ఇస్తాయా అన్నది సందేహమే.
Recommended Video