పాక్ను అక్కడ ఏకాకిని చేసి, మోడీ ఇక్కడ పూర్తిగా సఫలం కాలేదా?
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలో వలే.. బ్రిక్స్ సదస్సులోను పాకిస్తాన్ను ఏకాకి చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా సఫలమయ్యారా? అంటే లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూరి దాడి అనంతరం ఐక్య రాజ్య సమితిలో పాక్ను మోడీ ప్రభుత్వం ఏకాకిని చేసింది. ఆ తర్వాత ఎల్వోసీలో సర్జికల్ స్ట్రయిక్ దాడులు నిర్వహించింది.
పాక్ తీరును నిరసిస్తూ సార్క్ సదస్సును బహిష్కరించింది. పాక్ మినహా మిగతా దేశాల మద్దతు భారత్కు లభించింది. ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలు పాకిస్తాన్ను తూర్పారబట్టాయి. భారత్ సర్జికల్ దాడులను సమర్థించాయి. యూరి ఉగ్రదాడి అనంతరం పాక్ను మోడీ ప్రభుత్వం ఏకాకిని చేసింది.
అమెరికా నుంచి ఐక్య రాజ్య సమితి వరకు, సర్జికల్ దాడి నుంచి సార్క్ సదస్సు వరకు పాకిస్తాన్ పైన పై చేయి సాధించింది. అయితే, బ్రిక్స్ సదస్సులో మాత్రం మోడీ పూర్తిగా సఫలం కాలేదని అంటున్నారు. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు పాక్కు చైనా వంటి దేశం మద్దతు కూడా కారణమని చెప్పవచ్చు.
ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బ్రిక్స్ సదస్సులో తీవ్రవాదం పైనే మోడీ ఎక్కువ దృష్టి సారించారని అంటున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రతి సెషన్లో మోడీ లక్ష్యం పాకిస్తాన్, టెర్రరిజంగా కనిపించిందని అంటున్నారు. బ్రిక్స్ సదస్సు ఐదు దేశాల సమావేశం.
కేవలం అమెరికా ఒక్క దేశంతో చర్చించినట్లు కాదని అంటున్నారు. ప్రధానంగా ఇందులో పాక్కు అండగా నిలబడే చైనా ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో మోడీ పాకిస్తాన్నే ఏజెండాగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చైనా కుయుక్తులను మోడీ మరిచిపోయినట్లుగా ఉన్నారని అంటున్నారు.
బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అంతకుముందు ప్రధాని మోడీ పాకిస్తాన్ను ఉగ్రవాదానికి తల్లిగా అభివర్ణించారు. బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం బీజింగ్లో చైనా నాలుకను మడతేసింది. ఏ ఒక్క దేశాన్ని తాము ఉగ్రవాద దేశంగా భావించలేమని ప్రకటించి, భారత్కు షాకిచ్చింది.
అంతేకాకుండా, బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం అని చెప్పినప్పటికీ, అందులో పాక్ పేరు లేదా ఎల్వోసీ ఉద్రిక్తతలు లేవంటున్నారు. మొత్తంగా సార్క్ నుంచి ఐక్య రాజ్య సమితి వరకు పాక్ను మోడీ ప్రభుత్వం ఏకాకి చేసింది. కానీ చైనా వంటి దేశం ఉన్న బ్రిక్స్ సదస్సులో మాత్రం పూర్తిస్థాయిలో సఫలం కాలేదని అంటున్నారు.