తన భద్రతపై మరోసారి అప్పీల్ చేసిన మోడీ భార్య యశోదాబెన్
అహ్మదాబాద్: తనకు కల్పిస్తున్న భద్రత, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్ సమాచార హక్కు చట్టం ద్వారా మెహసన్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు ప్రకారం తాము భద్రతా పరమైన విషయాలను వెల్లడించలేమని, తమకు ఆ మినహాయింపు ఉందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో యశోదాబెన్ మరోసారి ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కింద తనకు భద్రతకు సంబంధించిన వివరాలను తెలపాలని విజ్ఞప్తి చేసింది. ‘నేను భారత ప్రధానమంత్రి భార్యను.. నేను ఆర్డర్(ఆమె భద్రత కోసం సంబంధించిన) కాపీని అడిగాను. అవి స్థానిక ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధం లేనవి. కాబట్టి ఆ ఆర్డర్ కాపీలను ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా' అని యశోదాబెన్ మెహ్సనా ఎస్పీకి చేసిన అప్పీల్లో పేర్కొన్నారు.
‘తనకు కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన డిఎస్పీ, అందుకు సరైన సమాధానం చెప్పలేదు. నేను ప్రధాని భార్యను, అందుకనే కొందరి జోక్యం కారణంగా నాకు ఆ సమాచారం ఇవ్వడం లేదు' అని యశోదాబెన్ అప్పీల్లో తెలిపారు. మెహ్సనా పోలీసులు చెప్పిన విధంగా మినహాయింపులేమైనా ఉంటే.. అందుకు సంబంధించిన రాష్ట్ర హోంశాఖ కాపీని కూడా ఇవ్వాలని ఆమె కోరారు.
కాగా, నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత నిబంధనల మేరకు పోలీసులు ప్రధాని భార్య హోదాలో యశోదాబెన్కు భద్రత కల్పించారు. అయితే తన అనుమతి లేకుండా తనకు భద్రత ఎలా కల్పిస్తారని నాడు అసహనం వ్యక్తం చేసిన యశోదాబెన్, సదరు అంశానికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన యాక్చువల్ ఆర్డర్ ధ్రువీకృత కాపీ సహా పలు పత్రాలను తనకు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. తన గార్డులు కార్ల వంటి ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తుండగా, ప్రధాని భార్యనై ఉండీ తాను బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణిస్తున్నానని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె గార్డులే.. పైగా ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే కాల్చి చంపారని జశోదా బెన్ గుర్తు చేశారు. తన గార్డుల పట్ల కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. తన భద్రత కోసం వినియోగించే గార్డుల నియామక పత్రాన్ని తనకు సమర్పించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన జశోదాబెన్... మెహసనా జిల్లాలోని ఉంఝా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె భద్రత నిమిత్తం 10 మంది పోలీసుల్ని కేటాయించిన విషయం తెలిసిందే.