మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్
Recommended Video
దేశంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధాని నరేంద్రమోడీకి ఈ సారి చెక్ పెట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తుంటే , మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనని బీజేపీ భావిస్తోంది. ఇక మోడీపై యుద్ధానికి మమతాబెనర్జీ నడుం బిగిస్తే అందుకు బాసటగా నిలిచారు చంద్రబాబు. బీజేపీయేతర కూటమిలో కీలక పాత్ర పోషించాలని , కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న దీదీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు.
జగన్ లక్ష్యంగా : చంద్రబాబు నయా స్కెచ్: కేసీఆర్కు అందుకే ఆ..సంకేతాలు ..!
నేను ఫోన్ చేస్తే తియ్యలేదు.. మమతకు అహంకారం అన్న మోడీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. ఫణి తుపాను నేపథ్యంలో మమత దీదీతో మాట్లాడేందుకు తాను రెండు సార్లు ఫోన్ చేశానని కానీ ఆమెకు రాజకీయాలే ముఖ్యమని ఆమె తనతో మాట్లాడేందుకు తిరస్కరించారని చెప్పారు. ఆమెకు అంత అహంకారం ఉందని దుయ్యబట్టారు. ఫణి తుపానును కూడా రాజకీయం చేసేందుకు స్పీడ్ బ్రేకర్ వంటి మమత యత్నించారని విమర్శించారు.తాను ఫోన్ చేసిన తర్వాత మమత తిరిగి తనకు ఫోన్ చేస్తారని అనుకున్నానని కానీ ఆమె నుంచి తనకు ఫోన్ రాలేదని మోడీ అన్నారు. అయినా పట్టించుకోకుండా, తాను మరోసారి ఆమెకు ఫోన్ చేశానని... రెండోసారి కూడా ఆమె తనతో మాట్లాడలేదని చెప్పారు. తుపాను నేపథ్యంలో బెంగాల్ ప్రజల కోసం తాను ఎంతో ఆందోళన చెందానని అందుకే మమతతో మాట్లాడేందుకు యత్నించానని అన్నారు. కానీ, ఆమె రాజకీయాలకే ప్రాధాన్యతను ఇచ్చారని విమర్శించారు.
మమతా బెనర్జీ బెంగాల్ టైగర్ అని చంద్రబాబు కితాబు
మోడీ విమర్శలు అలా వుంటే తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరోమారు పట్టం కట్టాలని కోరారు. మమతా బెనర్జీ నేతృత్వంలోనే బెంగాల్ అభివృద్ధి జరుగుతుందన్న చంద్రబాబు, ఆమెను ‘బెంగాల్ టైగర్'గా అభివర్ణించారు. ఇక ఓటర్లకు సూచనలు చేసిన చంద్రబాబు ఓటు వేసిన తర్వాత తమ ఓటు ఏ పార్టీకి వేశామో ఆ పార్టీకే పడిందో లేదో అన్న విషయం వీవీప్యాట్ స్లిప్సులను సరిచూసుకోవడం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఓటింగ్ సమయంలో ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలని సూచించారు. ఈ నెల 23న బీజేపీ ఓటమి చవిచూడబోతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు.
పొగడ్తలు తెగడ్తలతో రాజకీయం రసవత్తరం
మొత్తానికి మోడీ, మమతా బెనర్జీకి అహంకారం అంటే చంద్రబాబు ఆమె బెంగాల్ టైగర్ అని కితాబివ్వటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, పొగడ్తలు తెగడ్తలతో రాజకీయం రసకందాయంలో పడింది.