వెంకయ్య వర్సెస్ మాయావతి..! : 'బీజేపీ వచ్చాకే ఈ పరిస్థితి'
న్యూఢిల్లీ : గుజరాత్ లో దళితులపై దాడుల అంశం పార్లమెంట్ లో వాడి-వేడి చర్చకు దారితీసింది. విషయాన్ని లేవనెత్తిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే దేశంలో దళితులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మొన్నీమధ్యే గుజరాత్లోని యునా పట్టణంలో రెచ్చిపోయిన గో రక్షక దళం కార్యకర్తలు దళిత యువకులపై దాడికి పాల్పడి, వారితో పేడ తినిపించిన విషయాన్ని మాయావతి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ వచ్చాకే దళితులపై ఇలాంటి దాడులు పెరిగాయని ఆరోపించారు.
బీజేపీని యాంటి దళిత్ పార్టీగా అభివర్ణించిన మాయావతి, గుజరాత్ లో జరిగిన ఆ ఘటన మీడియాలో చర్చనీయాంశం అయ్యాక గానీ అక్కడి పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోలేదని, ఇది బీజేపీ 'యాంటి దళిత్ మైండ్ సెట్' కు నిదర్శనమని విమర్శించారు.
మాయావతి చేసిన ఆరోపణల నేపథ్యంలో.. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంశాన్ని ప్రస్తావించాలనుకుంటే ప్రస్తావించవచ్చు గానీ, దాడితో సంబంధం లేని పార్టీల పేర్లు ప్రస్తావించడం సరైంది కాదన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.