కోటిన్నర మంది మాత్రమే పన్ను కడుతున్నారన్న ప్రధాని... మోడీ లెక్కలను తప్పుబట్టిన నెటిజెన్లు
న్యూఢిల్లీ: గత ప్రభుత్వాలు పన్న వ్యవస్థను తాకాలంటేనే చాలా ఆలోచించేవని కానీ తమ ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుందంటే దానిపై ముందుకెళ్లడమే తెలుసని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. పౌరులను పన్ను విధిగా కట్టేలా సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ పన్నును సకాలంలో కట్టి దేశాభివృద్ధికి దోహదపడాలని మోడీ పిలుపునిచ్చారు. చాలామంది పన్ను ఎగవేతకు ప్రయత్నించారని ఈ క్రమంలో నిజాయితీగా పన్ను కట్టేవారు చాలామంది నష్టపోయారని మోడీ చెప్పారు.
మన పన్ను విధానం చాలా సులభంగా అర్థమవుతుంది
పన్ను విధానంపై తీసుకొచ్చిన కొత్త నిబంధనలు చాలా పారదర్శకతతో ఉన్నాయని చెప్పిన ప్రధాని.. ఇలా పన్ను విధానంలో పారదర్శకతతో వ్యవహరించే దేశాలు చాలా తక్కువని అందులో భారత్ ఒకటని చెప్పారు. పన్ను దారులకు చాలా సులభంగా అర్థమయ్యేలా తమ ప్రభుత్వం పన్ను విధానంను తీసుకొచ్చిందని చెప్పారు. పన్ను కట్టకుంటే కట్టని వారిని వేధింపులకు గురిచేసే రోజులు పోయాయని గుర్తు చేసిన ప్రధాని... ఇకపై అంతా కొత్తగా చాలా సరళీకృతంగా ఉంటుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
Recommended Video
నిజాయితీపరులపై పన్ను భారం
ఇక పన్ను కట్టకుండా ఎగవేసే వారున్నంత వరకూ ఆ భారం నిజాయితీగా పన్ను కడుతున్న వారిపై పడుతోందని మోడీ చెప్పారు. ఏడాదికి రూ. కోటి మేరా ఆస్తులు ప్రకటించిన వారిలో కేవలం 2200 మంది మాత్రమే ఉన్నారని ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ ఇదే నిజమన్నారు ప్రధాని మోడీ. గత ఐదేళ్లలో దాదాపు 1.5 కోట్లకు పైగా కారులు అమ్ముడుపోయాయని చెప్పిన ప్రధాని... మూడు కోట్లకు పైగా భారతీయులు ఇతర దేశాల్లో ఉద్యోగరీత్యా వెళ్లారని చెప్పారు. అయితే 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతుండటం శోచనీయమన్నారు.
ప్రధాని లెక్కలను తప్పుబట్టిన నెటిజెన్లు
ఇదిలా ఉంటే ప్రధాని చెప్పిన లెక్కలపై నెటిజెన్లు ట్విటర్లో వాస్తవాలను ఉంచారు. పన్నులు కట్టే వారి సంఖ్య గురించి ప్రధాని చెప్పిన లెక్కకంటే ఎక్కువగానే ఉదంటూ ట్వీట్ చేశారు. ప్రధాని 1.5 కోట్ల మంది మాత్రమే పన్ను కడుతున్నారని చెప్పారని వాస్తవానికి 2018 - 19లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి సంఖ్య 5.52 కోట్లుగా ఉందని నెటిజెన్లు ట్వీట్ చేశారు. ఇందులో 2.62 కోట్ల మంది పన్ను కట్టలేదని మరో 2.9 కోట్ల మంది పన్ను కట్టారని చెబుతూ ప్రధాని చెప్పిన సంఖ్య కంటే పన్ను కట్టిన వారి సంఖ్య రెట్టింపుగా ఉందని ట్వీట్ చేశారు.
రూ.కోటి పైగా ఆస్తులు డిక్లేర్ చేసింది 2200 మంది అన్నది అవాస్తవం
అక్టోబర్ 2018న పీఐబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇచ్చిన సమాచారం మేరకు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలు చూసుకుంటే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో దాదాపు 80శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఉంది.2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.79 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి 6.85 కోట్లు మంది ఐటి రిటర్న్స్ ఫైల్ చేశారని తెలుస్తోంది. ఇక 2200 మంది మాత్రమే తమ ఆస్తులను రూ. కోటిగా డిక్లేర్ చేశారన్న ప్రధాని వ్యాఖ్యలపై కూడా నెటిజెన్లు స్పష్టత ఇచ్చారు. 2014 - 15లో 88,649 మంది తమ ఆస్తులను రూ.కోటి ఆపై ఉన్నట్లు డిక్లేర్ చేయగా... 2017-18 నాటికి 1,40,139 మంది కోటికి పైగా తమ ఆస్తులను డిక్లేర్ చేసినట్లు సీబీడీటీ లెక్కలు చెబుతున్నాయని వెల్లడించారు.