అదే గనుక జరిగితే..! మమ్మల్ని 'తన్ని తరిమేయండి..' : మోడీ సంచలన కామెంట్స్
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో బీజేపీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. యూపీ ప్రజలు బీజేపీని అధికారం తీసుకురావాలని సూచించారు.
ఒకవేళ యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలకు నష్టం కలిగించే చర్యలు జరిగితే తమను రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాలని సంచలన కామెంట్స్ చేశారు మోడీ. మాయావతి, ములాయం ఇద్దరూ తోడు దొంగలేనని, తలో ఐదేళ్లు యూపీలో అధికారంలోకి వస్తూ దోచుకు తింటున్నారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ ప్రజలు మాయావతి, ములాయం నుంచి విముక్తి కావాలంటే బీజేపీకి అధికారం కట్టబెట్టాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే, ఐదేళ్లలో యూపీ రూపు రేఖలు మార్చేస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామి ఇచ్చారు. యూపీ అభివృద్ధి దిశగా పయనిస్తే, భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ అవడం ఖాయమన్నారు.
మోడీ సరికొత్త ట్రెండ్ :
ఇక తమను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలిపే విషయంలోను ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఫాలో అవుతున్నారు. రొటీన్ గా కొట్లే చప్పట్లు, వగైరా కాకుండా మొబైల్ ఫోన్ లైట్లతో అభినందనలు తెలియజేసే ట్రెండ్ కి నాంది పలికారు మోడీ. పరివర్తన్ ర్యాలీలో భాగంగా.. అక్కడికి హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో అందరిని మొబైల్ ఫోన్లు బయటికి తీయాల్సిందిగా కోరారు మోడీ.
అనంతరం మొబైల్ లైట్ ఆన్ చేసి సంఘీభావంగా అందరూ పైకెత్తి చూపాలని కోరారు. దీంతో మోడీ చెప్పినట్టే చేసుకుపోయారు జనం. అస్సాం ప్రజలు బీజేపీకి అధికార పగ్గాలు కట్టబెట్టిన సందర్భంగా అక్కడి ప్రజలకు అభినందనలు తెలియజేయడానికి ఇలా మొబైల్ ఫోన్ లైట్ ని ఫాలో అయ్యారు మోడీ.
అందరి దృష్టి ఆయనపైనే.. :
ఇక బీజేపీ పరివర్తన్ ర్యాలీలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని పార్టీ నాయకత్వం వేదికపై కూర్చోబెట్టడం. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన్ను దూరంగా ఉంచుతూ అవమానిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నేటి సభలో మురళీ మనోహర్ జోషికి వేదికపై స్థానం కల్పించడం హాట్ టాపిక్ గా మారింది.
ఆదివారం నాడు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి జోషికి ఆహ్వానం అందకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తికి లోనయ్యారు. పార్టీపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఇదిలా ఉంటే నేటి పరివర్తన్ ర్యాలీలో మోడీ జోషిని పొగడ్తల్లో ముంచెత్తడం ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.