మోడీ 2.0 కేబినెట్ రెడీ: కలిసి ప్రయాణిస్తూనే మంత్రుల జాబితా సిద్ధం చేసిన మోడీ-షా ద్వయం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందంటే ఇందుకు కారణం మోడీ షా ద్వయమే అని చెప్పక తప్పదు. గత గురువారం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీ సాధించింది బీజేపీ. ఇక ఆదివారం నుంచి ఇరు నేతలు ఢిల్లీలో లేకుండా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇద్దరూ కలసి పర్యటనలు చేస్తున్నారంటే దాని వెనక ఓ రహస్యం దాగి ఉందనేది విశ్లేషకుల అంచనా.
మోడీ 2.0 కేబినెట్ రెడీ
మే 30న ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ లోపే తన కేబినెట్ను నిర్ణయించాలని మోడీ షా ద్వయం భావిస్తోందట. ఇందులో భాగంగానే వీరిద్దరూ కలిసి పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో గ్యాప్ దొరికినప్పుడు కేబినెట్ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతున్నారట. ఇదిలా ఉంటే ఇద్దరు కలిసి పర్యటనలు చేస్తున్న సమయంలోనే కేబినెట్ మంత్రుల జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలోనే మంత్రుల జాబితాను సిద్ధం చేసిన మోడీ-షా ద్వయం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు.
చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం
ఇక మంత్రి వర్గంపై అమిత్ షా ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. ఆయా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల సూచనలు సలహాలను కూడా అమిత్ షా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ అయిన జాబితాలో మళ్లీ మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చాలామంది ఎన్నికైన ఎంపీలు మంత్రి పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సీనియర్ మంత్రుల ఇంటి చుట్టూ కొందరు తిరుగుతుండగా మరికొందరు మాత్రం షా, మోడీలకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఓ సీనియర్ ఎంపీ నాలుగు సార్లు తాను గెలిచినట్లు చెప్పారు. మంత్రి పదవి కోసం కొందరి టాప్ నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ వర్గాలను సంప్రదించినట్లు చెప్పారు.
మోడీ కొత్త ప్రభుత్వం ఇలా ఉండే అవకాశం
ఇక కొత్తగా ఏర్పాటు కాబోయే మోడీ కేబినెట్లో మంత్రి పదవుల బెర్తులు ఖరారు కానున్నాయి. బీజేపీ మిత్ర పక్షాలకు కూడా మంత్రి పదవులు దక్కనున్నాయి. జేడీయూకు రెండు మంత్రి పదవులు దక్కన్నున్నాయి. ఇందులో ఒకటి కేబినెట్ మంత్రి పదవి మరొకటి సహాయశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. శివసేనకు రెండు మంత్రి పదవులు, అప్నాదల్కు ఒక మంత్రి పదవి దక్కనుంది. ఇక బీజేపీకి కష్టం అనుకున్న తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో కమలం పార్టీకి ప్రజలు పట్టం కట్టినందున ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకు కూడా మోడీ కేబినెట్లో స్థానం దక్కుతుంది. బెంగాల్ నుంచి ఇద్దరికి లేదా ముగ్గురికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇక గత కేబినెట్ నుంచి కూడా పలువురికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వీరిలో నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా, ప్రకాష్ జవడేకర్లు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.