12న బీజేపీ ఎంపీల దీక్షలో మోడీ: ‘అవిశ్వాసం’ను పక్కదారి పట్టించేందుకేనా?
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయకుండా అడ్డుకున్న విపక్షాల తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏప్రిల్ 12న నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎంపీల దీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని హుబ్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో ఆ పార్టీ నేతలు దీక్ష చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను జరగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Recommended Video
ఎలాంటి చర్చ జరగకుండానే ఏప్రిల్ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయాయి. విపక్షాల ఆందోళనలతో 2019 ఎన్నికలకు ముందు కీలక బిల్లులు అమలుకు నోచుకోకుండానే పోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశమంలో మొత్తం ఐదు అవిశ్వాస తీర్మానాలు చర్చకు నోచుకోలేదు. బడ్జెట్, దానికి సంబంధించిన బిల్లులు మాత్రం చర్చ జరగకుండానే ఆమోదింపజేశారు. 8 బిల్లులు ప్రవేశపెట్టపెట్టాల్సి ఉండగా, రెండు బిల్లులను మాత్రమే పార్లమెంటులో ప్రవేవపెట్టారు.
పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ దిగజారుడుగా వ్యవహరించిందని, సమావేశాలు జరగకుండా చేసిందని ఆరోపించిన ప్రధాని మోడీ.. ఇందుకు నిరసనగా బీజేపీలు ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో పిలుపునిచ్చారు.
దేశంలో మతసామరస్యాన్ని కోరుతూ ఏప్రిల్ 9న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ నేతలు దీక్షలు చేశారు.
ఏప్రిల్ 12న మోడీ దీక్షలో పాల్గొన్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో మార్పులు ఉండవని, ప్రజలు, అధికారులను కలుస్తారని తెలిసింది. కాగా, బీజేపీ ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో నిరాహార దీక్షను చేపట్టనున్నారు. కాగా, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే బీజేపీ నిరాహార దీక్ష చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు అంగీకరించకుండా, ఇప్పుడు దీక్షలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.