అయోధ్యలో ప్రతిపక్షాలపై మోడీ ధ్వజం...రామమందిర నిర్మాణంపై మాట్లాడని ప్రధాని
అయోధ్య: సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మూడూ దొందూ దొందే అని ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ అయోధ్యలో పర్యటించారు. గత ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బేరీజు వేయాలని ప్రజలను కోరారు. మూడు పార్టీల నిజస్వరూపం తెలుసుకోవాలని మోడీ చెప్పారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి మాట్లాడుతుంది కానీ ఆమె చేసే పనులన్నీ అంబేడ్కర్ విధానాలకు వ్యతిరేకంగా ఉంటాయని ధ్వజమెత్తారు. సమాజ్ వాదీ పార్టీ లోహియా పేరు తలుచుకోకుండా ఉండలేదు కానీ... ఉత్తర్ ప్రదేశ్లో వారు శాంతి భద్రతలను ధ్వంసం చేశారు అని నిప్పులు చెరిగారు మోడీ. ఇక కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేద ప్రజలంటే కాంగ్రెస్కు పట్టదని అన్నారు. కేవలం వారి స్వప్రయోజనాల కోసమే వారు పాటుపడే వ్యక్తులు అని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్లో నాయకులు గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తారని ఎద్దేవా చేశారు. పేద ప్రజలు, కార్మికుల జీవితాలు మెరుగుపడేందుకు తమ ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తోందని మోడీ గుర్తుచేశారు.
ఇదంతా ఇలా ఉంటే అయోధ్యలో మోడీ సభకు హాజరైన వారిలో అధిక సంఖ్యలో సాధువులు కనిపించారు. అయోధ్య రామమందిరంపై మోడీ ఒక ప్రకటన చేస్తారని అంతా భావించినప్పటికీ ప్రధాని మాట్లాడకపోవడంతో అంతా నిరాశకు లోనయ్యారు.