మీ వాడు 'పబ్జీ' వాలానా?.. గేమ్లపై మోడీ ఆసక్తికర చర్చ
ఢిల్లీ : అరచేతిలో ప్రపంచం చూస్తున్న రోజులివి, టెక్నాలజీ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి, సాంకేతికతను అందిపుచ్చుకోవాలే గానీ మన ఆలోచన చిన్నదిగా చేసేలా ఉండకూడదు. ఇవి పరీక్ష పే చర్చ 2.0 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి తల్లి.. తన కొడుకు గురించి ఆవేదనగా మాట్లాడిన సందర్భంలో మోడీ ఈ విధంగా స్పందించారు.
మా అబ్బాయి బాగా చదివేవాడు, ఇంటా బయటా ఎక్కడా చూసినా వాడికి మెప్పు లభించేది. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ కారణంగా చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరెంతగా చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరు చేసే సూచనతో వాడిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానంటూ ఆ తల్లి మోడీని కోరింది. దీంతో ఆయన మాట్లాడుతూ.. మీ వాడు పబ్జీ వాలానా అంటూ అడిగారు. దీంతో ఆ సందర్భానికి అక్కడున్నవాళ్లు పెద్దగా నవ్వారు. ఆ తర్వాత మోడీ వ్యాఖ్యలను ఆసక్తిగా విన్నారు.
గేమ్స్ పట్ల పిల్లలు బానిసవుతున్నారనే కారణంగా వారిని టెక్నాలజీకి దూరం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు మోడీ. సాంకేతికత ద్వారా సరికొత్త మార్గాలు అన్వేషించిలా పిల్లల్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతిదాంట్లో ప్లస్, మైనస్ ఉన్నట్లే టెక్నాలజీ విషయంలో కూడా ఉంటాయన్నారు. అయితే పిల్లలకు ఏంకావాలనే దానిపై తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. టెక్నాలజీ ద్వారా వారు మంచి ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్తపడాలన్నారు. తాము సాధించలేకపోయామని.. వాటిని పిల్లలపై రుద్దాలనుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. మెల్లిమెల్లిగా వారిని ఫోన్లలో గేమ్స్ ఆడే పరిస్థితి నుంచి ప్లే గ్రౌండ్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు.