చైనా సరిహద్దుల్లో సైనికుల మృతిపై కేంద్రానికి రాహుల్ సూటి ప్రశ్నలు- ఇరుకున పడ్డ మోడీ..
చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో భారత్ కు చెందిన 20 మంది సైనికులు చనిపోవడంపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే నిన్న అఖిల పక్ష భేటీలో ప్రధాని మోడీ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. గల్వాన్ లోయలో భారత్ కు చెందిన దాదాపు 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీటిపై నిన్న అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. మన భూభాగం ఆక్రమణలు గురి కాలేదని, చైనా బలగాలు చొరబడలేదంటూ మోడీ అఖిలపక్ష నేతలకు వెల్లడించారు.
అయితే దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ తీవ్రంగా స్పందించారు. మన భూభాగం ఆక్రమణకు గురి కాకపోతే సైనికులు ఎలా చనిపోయారని ప్రధాని మోడీని ట్విట్టర్ లో ప్రశ్నించారు. చైనా దురాక్రమణకు లొంగి కేంద్రం మన భూభాగాన్ని వారికి అప్పగించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ ఆ భూభాగం చైనాదే అయితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ ప్రధాని మోడీని ఇరుకున పెట్టారు. మన సైనికులు ఎందుకు చనిపోయారు, ఎక్కడ చనిపోయారో కేంద్రం క్లారిటీ ఇవ్వాలంటూ రాహుల్ చేసిన ట్వీట్లు తీవ్ర కలకలం రేపాయి.
ఈ నెల 16న గల్వాల్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీనిపై స్పందించిన కేంద్రం... ఎలాంటి చొరబాట్లు జరగలేదని చెబుతున్న వేళ రాహుల్ ప్రశ్నలు కేంద్రాన్ని ఇరుకునపెట్టాయి. సున్నితమైన వ్యవహారం కావడంతో కేంద్రం కూడా ఇప్పుడు దీనిపై ఆచితూచి స్పందించాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది.