కశ్మీర్ విభజన వేరు.. ఎన్నికలు వేరు... విపక్షాల కామెంట్లపై మోడీ ఫైర్
జమ్ముకశ్మీర్ విభజనకు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కశ్మీర్ అంశాన్ని బూచీగా చూపి ఓట్లు అడగబోమన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మోడీ తీవ్రంగా స్పందించారు. ఆయన గురువారం ఆకోలాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఒంటికాలిపై లేచారు.
జమ్ముకశ్మీర్ విభజన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం లేదన్నారు. కానీ కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. వారంతా సిగ్గుతో తలదించుకోవాలి (డూబ్ మారో) అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ ప్రజలు భారతమాత ముద్దుబిడ్డలనే అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ కొందరు ఎన్నికలకు ముడివేయడంతో తనను తీవ్రంగా కలచివేస్తోందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని ఎన్నికలతో వారు ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఆపండి మీ ఆసత్య ప్రచారాలను అని ఘాటుగా స్పందించారు.
కశ్మీర్ అంశంపై మహారాష్ట్ర సహా యావత్ దేశం అండగా నిలవడాన్ని మోడీ స్వాగతించారు. ప్రాంతాలు, మతాలకతీతంగా ప్రజలంతా మద్దతు తెలిపారని చెప్పారు. మరోవైను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించారు. ఫడ్నవీస్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పుంతలు తొక్కందని పేర్కొన్నారు. అంతకుముందు మహారాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండేదో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి తెలిపారు. కానీ ఫడ్నవీస్ నేతృత్వంలో రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.