వారణాసి.. హరహర మోడీ నామస్మరణం
వారణాసి: దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేపట్టిన లక్షిత దాడులను ప్రశ్నిస్తారా? అని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. వాటికి రుజువులు చూపాలని స్వార్థ రాజకీయాలు చేశారన్నారు. జాతీయ భద్రతపై రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదశ ఎన్నికల ప్రచారం సందర్భంగా వారణాసిలో మూడు ప్రదాన పార్టీల అధినేతల రాకతో నగర వీధులన్నీ హోరెత్తాయి. మోదీ ఆధ్వర్యంలో సాగిన రోడ్ షోకు ప్రజలు నీరాజనాలు పలికారు. కాశీ విశ్వనాథుడు, కాల భైరవ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వారణాసి మహిళలు ప్రత్యేకంగా బారులు తీరారు.
అతను కనిపిస్తే టీవీ ఆఫ్ చేస్తా, నా పిల్లల్ని కూడా చూడనివ్వను: డింపుల్
రాష్ట్ర అసెంబ్లీ ఆఖరి దశ ఎన్నికలు ఈనెల 8న జరుగనున్నాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభా నియోజకవర్గం వారణాసి పరిధిలోని అసెంబ్లీ సీట్లు కూడా ఉన్నాయి. భారతీయ వైమానిక దళానికి చెందిన హెలిక్యాప్టర్లో తొలుత బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చేరుకున్న మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా స్వాగతం పలికారు. స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకు నివాళులర్పించి రోడ్ షోకు శ్రీకారం చుట్టారు.
అడుగడుగునా ‘నీరాజనం’
తర్వాత పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో రోడ్షోకు బయల్దేరారు. రోడ్లకు ఇరువైపులా.. ఇండ్లపైన.. బంగ్లాలపైన.. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కిక్కిరిసిన జనం మధ్య రోడ్షో నెమ్మదిగా ముందుకు కదిలింది. రవిదాస్ గేట్ లంక, అస్సి, మదని, సోనార్పురా, గోదోవ్లీ, బస్పతక్ ప్రాంతాల గుండా కాశీ విశ్వనాథ ఆలయం వైపు రోడ్షో కొనసాగింది. దారి వెంట జనసందోహం హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత జౌన్పూర్లో రెండు చోట్ల మోదీ ప్రసంగించారు. సైనికుల నిజమైన సంరక్షణ కోసం బీజేపీ మాత్రమే పాటుపడుతున్నదన్నారు. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకానికి గత యూపీఏ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించగా, బీజేపీ ప్రభుత్వం రూ. 1200 కోట్లను కేటాయించిందని తెలిపారు.
పెద్ద నోట్ల రద్దుతో విపక్షాలకు కష్టాలు
అవినీతిలో కూరుకుపోయినందుకే విపక్ష పార్టీలు పెద్దనోట్ల రద్దుపై విమర్శలు చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల బీఎస్పీ అధినేత మాయావతి, యూపీ సీఎం అఖిలేశ్యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాత్రమే సుఖంగా లేరని చెప్పారు. మహిళల భద్రతను అఖిలేశ్యాదవ్ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తున్నదన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో సమాజ్వాదీ మంత్రి గాయత్రి ప్రజాపతి నిందితుడిగా ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు సుఖశాంతుల కోసం గాయత్రి మంత్రాన్ని జపిస్తుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గాయత్రి ప్రజాపతి మంత్రాన్ని జపిస్తున్నదని ప్రధాని ఎద్దేవా చేశారు. ఒక నేరస్తుడికి సీఎం అఖిలేశ్యాదవ్ ఆశ్రయం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీకి అధికారం ఖాయమన్న మోదీ
యూపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏైళ్లెనా యూపీలో చాలా చోట్ల ఇంకా విద్యుత్ సౌకర్యం లేదన్నారు. యూపీలోని ప్రతిగ్రామానికి విద్యుత్ అందించాలన్నదే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని జైళ్లన్నీ గ్యాంగ్స్టర్లతో నిండిపోయాయన్న ప్రధాని జైళ్ల నుంచే నేరస్తులు నేర సామ్రాజ్యం నడుపుతున్నారని పేర్కొన్నారు. యూపీలో అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్పీ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం తమకు ఓట్లు వేయాలని ప్రధాని కోరారు.
ప్రధాని హోదాలో రోడ్షోలా?:కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహా సూచన
ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో రోడ్షోలు నిర్వహించడంపై ఆయన క్యాబినెట్ సహచరుడు ఉపేంద్ర కుశ్వాహా అభ్యంతరం వ్యక్తం చేశారు.‘ప్రధాని హోదాలో మోదీ రోడ్ షో నిర్వహించడం తగదు. ఆయన కేవలం సభల్లో మాత్రమే పాల్గొనాలి. ఈ విషయాన్ని బీజేపీలోని నా స్నేహితులతో చెప్తా అని కేంద్రమంత్రి కుశ్వాహా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.బీహార్కు చెందిన కుశ్వాహా బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్గా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేయాలని తలపోశారు. కానీ బీజేపీ యూపీలోని చిన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకున్నది.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను కోరారని ఆర్ఎల్ఎస్పీ) అధినేత ఉపేంద్ర కుశ్వాహా చెప్పారు. ఆయన అభ్యర్థన మేరకే పోటీకి దూరంగా ఉన్నామని తెలిపారు.